అప్పుడు ఆత్మహత్యకు ప్రయత్నించా.. అన్నయ్య, వదిన వల్లే.. పవన్ కల్యాణ్
విద్యార్థి దశలో ఏమి సాధించలేదడం లేదనే ఫీలింగ్తో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించానని పవన్ కల్యాణ్ తెలిపారు.
చిన్నతనంలో అనారోగ్యంతో బాధపడటం కారణంగా చదువు అంతగా అబ్బలేదని, పలుమార్లు పరీక్షలు తప్పేవాడినని ఇటీవల ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మహాత్మగాంధీ రాసిన సత్యశోధన పుస్తకం తనపై ప్రభావం చూపించిందని ఆయన వెల్లడించారు

కాపీ కొట్టే అవకాశం వచ్చినా..
ఇంటర్ పరీక్షలు రాసే సమయంలో కాపీ కొట్టే అవకాశం వచ్చినా ఆ పని చేయలేదు. అందుకు కారణం మహాత్ముడి విలువలేనని పవన్ చెప్పారు. కాపీ కొట్టడానికి అంతరాత్మ అంగీకరించకపోవడంతో ఆ ప్రయత్నాని విరమించుకొన్నాను అని తెలిపారు. కాపీ కొట్టకుండానే నాకు వచ్చింది రాసి బయటకు వచ్చేశాను అని వెల్లడించారు.

ఫెయిల్ అయ్యాను.
ఊహించినట్టే పరీక్షా ఫలితాల్లో నా నంబరు కనబడలేదు. ఎనిమిదో తరగతి నుంచి ఫెయిలవ్వడం అలవాటే. ఫెయిల్ అవ్వడం కొత్తకాదు కనుక పట్టించుకోలేదు. మరోసారి ప్రయత్నించినా పాస్ కాలేకపోయాను. ఇక అప్పుడు అనిపించింది పాస్ కావడం అసాధ్యం అని పవర్ స్టార్ తెలిపారు.

మానసికంగా బాధపడ్డాను..
యుక్త వయస్సులో నా తోటివారందరూ చదువులోను, క్రీడల్లోనూ రాణిస్తుంటే చూసి బాధగా ఉండేది. పేపర్లో చూస్తే సచిన్ టెండూల్కర్, విశ్వనాథ్ లాంటి చిన్నవయస్సులోనే అద్భుతమైన ప్రతిభను చూపిస్తున్నారనే వార్తలు కనపడేయి. నాకే ఎందుకలా అవుతున్నది. నేను ఏమి సాధించలేక పోతున్నాను అనే నిస్పృహ వెంటాడేది. దాంతో మానసికంగా కుంగిపోయాను అని పవన్ కల్యాణ్ తన భావాలను పంచుకొన్నారు.

ఒత్తిడితో ఆత్మహత్యకు ప్రయత్నించా
ఏమీ సాధించలేకపోతున్నానే ఒత్తిడిలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించాను. కాస్త ఆలస్యమైతే ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఇంట్లో వాళ్లు నన్ను కాపాడారు. అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ మానసిక స్థైర్యాన్ని నింపారు. డిగ్రీలు చదివితేనే చదువు కాదు. నువ్వు చదివినా చదవకపోయినా మేం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. జీవితంలో స్పష్టత ముఖ్యం. ముందు, నీకేం కావాలో నిర్ణయించుకో' అని సలహా ఇచ్చారని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

గెలుపు, ఓటములు జీవితంలో భాగం
జీవితంలో గెలుపు, ఓటములు ఓ భాగం. సక్సెస్ లభించిందని తల ఎగిరేస్తే.. మరో రోజు ఫ్లాపులు ఎదురైతే తల వంచుకొని నిలబడాల్సి వస్తుంది. దర్శకుడిగా జానీ చిత్ర ఫ్లాప్ను ఆనందంగా స్వీకరించా. నా సన్నిహితులే భరించలేకపోయారు. తాము ఓటమి పాలనైంతగా ఫీలయ్యారు. జానీ తర్వాత సినిమాలు మానేద్దామనుకున్నాను. కాని ఆ తర్వాత 22 సినిమాలు చేశాను అని పవన్ కల్యాణ్ చెప్పారు.

జానీ తర్వాత సినిమాలు మానేద్దామనుకున్నా..
నేను సినిమాను సినిమాగానే చూస్తాను. ప్రేక్షకులు కేవలం వినోదం కోసమే సినిమాకు వస్తారు. అలా అని బలవంతంగా వాళ్ల మీద మన అభిప్రాయాలను రుద్దవద్దు. కాకపోతే సినిమాలోనే అంతర్లీనంగా మంచిని చెప్పే ప్రయత్నం చేయాలి. కాటమరాయుడు సినిమా విషయంలోనూ అంతే! నా అభిమానులు కోరుకునేవన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. సందేశం కూడా కనిపిస్తుంది అని పవన్ కల్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications











