ఏపీకి టాలీవుడ్ షిఫ్టింగ్.. ఆ కండీషన్లతో కష్టమే : సుమన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసందే.. గడిచిన ఐదేళ్లు జగన్ పాలనలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. సినీ పరిశ్రమ ఎంతో ఇష్టపడే చంద్రబాబు సీఎం కాగా.. స్వయంగా సినీ రంగానికి చెందిన పవర్స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో టాలీవుడ్కు ఏపీలో మంచిరోజులు వచ్చాయని భావిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కొత్తగా సినిమాటోగ్రఫి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జనసేన నేత, కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో నేటికీ చర్చనీయాంశమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లకు అద్భుతమైన లోకేషన్లు ఉన్నాయని .. చిత్రీకరణలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణం కోసం ముందుకు రావాలని నిర్మాతలకు , సినీ ప్రముఖులకు మంత్రి ఆహ్వానం పలికారు.
విస్తారమైన సముద్ర తీరం.. గోదావరి జిల్లాలు, చారిత్రక కోటలు, పుణ్యక్షేత్రాలు, హార్స్లీ హిల్స్, తడ, తలకోన , గుట్టలు, లోయలు ఇలా ఒకేటేమిటి ఏపీలో షూటింగ్లకు అనువైన ప్రదేశాలు బోలెడు. అన్నింటికి మించి చిత్ర ప్రముఖులకు ఎంతో ఇష్టమైన విశాఖపట్నం రెడీగా ఉంది. ఇప్పటికే అక్కడ రామానాయుడు స్టూడియో అన్ని హంగులతో సిద్ధమైంది. విశాఖలో కానీ , అమరావతిలో కానీ స్టూడియోలు కట్టడానికి సినీ ప్రమఖులు నివసించడానికి భూములు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం కూడా రెడీ.

అయితే దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు పెంచి స్థానికులకు ఉపాధి కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోందట. దీనికి తగిన పాలసీలు రూపొందించాలని టాలీవుడ్లో తనతో సన్నిహితంగా ఉండే వారికి సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పాలనలో తన మార్క్ చూపించాలని యోచిస్తుండటం, పైగా సినీ రంగంలోని సమస్యలు తనకు కొట్టిన పిండి కావడంతో తనే ఓ బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని చూస్తున్నారట.
ఈ నేపథ్యంలో ఏపీకి చిత్ర పరిశ్రమ తరలింపు, అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు సుమన్. ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసిన సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికలు, ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటుతో అంతా తీరిక లేకుండా ఉండటంతో తాను ఇప్పటి వరకు ఎవరినీ కలవలేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమకు అవకాశాలు కల్పించడం, స్టూడియోలు కట్టడమే కాకుండా మరిన్ని పనులు చేయాలని సుమన్ సూచించారు. చిన్న సినిమాలు ఆడాలంటే లొకేషన్లు కూడా బాగుండాలని, పెద్ద సినిమాలు 20 శాతం ఏపీలో తీసి మిగిలినవీ ఫారిన్లో తీస్తున్నారని ఆయన తెలిపారు.

తమిళం, మలయాళ ఇండస్ట్రీ వాళ్లు రాసే కథల్లో స్వేచ్ఛ ఉంటుందని, వారు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి సినిమాలు తీస్తారని సుమన్ వ్యాఖ్యానించారు. అప్పట్లో మద్రాస్ నుంచి హైదరాబాద్కు తరలిరావడానికి గాను ఇక్కడే షూటింగ్లు చేయాలని, 20 శాతం మాత్రమే బయట తీయాలనే నిబంధన పెట్టారని సుమన్ గుర్తుచేశారు. హైదరాబాద్లో ఉన్న అన్ని లోకేషన్లలో ఇప్పటికే వందలాది సినిమాలు తీసేశామని.. కొత్త లొకేషన్లు ఉంటే తప్పించి ప్రేక్షకులు కొత్త సినిమాలను చూడటం లేదన్నారు. బడా నిర్మాతలకు సెట్స్ వేసి షూటింగ్ చేసుకునేంత డబ్బు ఉంటుందని, కానీ చిన్న సినిమా బతకాలంటే ఏపీలో ఫిలిం సిటీ మాదిరిగా చిన్న చిన్న సెట్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఆయన సూచించారు.


Click it and Unblock the Notifications











