'దేనికైనారెడీ' పై అభ్యంతరాలు లేవని చెప్పించారంటూ...
తిరుపతి : 'దేనికైనారెడీ' చిత్రాన్ని తమ కళాశాలలో చదువుతున్న బ్రాహ్మణ విద్యార్థుల తల్లిదండ్రులకు తిరుపతి బిగ్ సినిమా థియేటర్లో చిత్రాన్ని చూపించి సినిమాలో ఎలాంటి అభ్యంతరాలు లేవని వారితో చెప్పించారని తిరుపతికి చెందిన బ్రాహ్మణ సంఘాలు ఆరోపించారు. చిత్రంలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని, బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆరోపించటంలో అర్థం లేదని కొందరు బ్రాహ్మణులు మీడియాతో నిన్న వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ పాత్రలతో హాస్యాన్ని పండించినంత మాత్రాన అది బ్రాహ్మణులను కించపరిచనట్లు కాదని వారు పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో తిరుపతిలో బ్రాహ్మణ సంఘాలు కావాలని వారితో అలా చెప్పించారని మండిపడుతున్నారు.
బ్రాహ్మణులను అవమానపరిచేవిధంగా, హిందూ సంస్కృతిని దెబ్బతీసేలా ఉన్న సినిమాలు తీస్తూ సమర్ధించుకోవడం మోహన్బాబుకు తగదని ఎపి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సిఆర్కె శేషగిరిరావు అన్నారు. తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేనికైనారెడీ అనే చిత్రంలో బ్రాహ్మాణులను కించపరిచేలా పలు సన్నివేశాలున్నాయన్నారు. పైన అంగవస్త్రం లేకుండా హోమం చేయడం హైందవ సంప్రదాయమన్నారు. చిత్ర నిర్మాత మోహన్బాబు వెంటనే బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని దక్షిణ భారత బ్రాహ్మణ సమాఖ్య, తిరుపతి ఛాంబర్స్ నాయకులు విడిగా మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
మరో ప్రక్క హైదరాబాద్ లో బ్రాహ్మణులను కించపరుస్తూ తీసిన దేనికైనారెడీ సినిమాను వెంటనే నిషేధించాలని ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో టిడిపి నాయకులు, బ్రాహ్మణ నాయకులు డిమాండ్ చేశారు. టీవి చానల్ చర్చలో మాట్లాడి బ్రాహ్మణ సంఘం నాయకులు అటు నుంచి మోహన్బాబు ఇంటి మీదుగా వస్తుండగా, మంచు విష్ణు దగ్గరుండి కొట్టించారని తెలిపారు. దాడికి ముఖ్యకారకుడైన వ్యక్తిపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ సమాజానికి మోహన్బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి, వారి ఉద్యమానికి టిడిపి మద్దతు ఉంటుందని తెలిపారు. బ్రాహ్మాణ సమాజాన్ని కానీ, కులాలను, మతాలను సినిమాల్లో, మీడియాలో కించపరచరాదని సూచించారు. ఇప్పటికైనా నిర్మాతలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. బ్రాహ్మణులను వ్యంగ్యంగా చిత్రీకరిస్తే సహించేది లేదని అన్నారు. చూసి చూడనట్టు వదిలివేయడాన్ని అసమర్ధతగా భావించవద్దని అన్నారు. బ్రాహ్మణులను కించపరిచే పోకడలను సినీ వర్గాలు మానుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారని, పరిస్థితి చేయి దాటక ముందే సినిమా నిర్మాతలు, సెన్సార్ బోర్డు సభ్యులు తగు నడుచుకోవాలని కోరారు.


Click it and Unblock the Notifications











