చిరంజీవికి పిచ్చ ఫ్యాన్ గా టీడీపీ ఎంఎల్ఏ.. పేపర్ చించి ఎగుర వేస్తూ హంగామా
నాలుగు దశాబ్ధాలుగా తెలుగువారి జీవితంలో భాగమయ్యారు మెగాస్టార్ చిరంజీవి. తన నటనతో , వ్యక్తిత్వంతో కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్నారు చిరు. కృషి, పట్టుదల, ప్రతిభ ఉంటే .. ఎవరైనా, ఎంతటి సామాన్యులైనా అసాధారణ స్థితికి చేరొచ్చని నిరూపించారు చిరంజీవి. ఆయన నటించిన రుద్రవీణ, ఛాలెంజ్, స్వయంకృషి వంటి సినిమాల నుంచి స్పూర్తి పొంది జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారెందరో. ఇలాంటి వారు అప్పుడప్పుడు తారసపడి.. తాము చిరంజీవి నుంచి ఎలా ఇన్స్పిరేషన్ పొందింది చెబుతుంటే అభిమానుల గుండెలు పులకించిపోతాయి.
ఇక సినీ పరిశ్రమలో ఎంతోమంది నూతన నటీనటులు, దర్శకులు, టెక్నీషీయన్స్ చిరంజీవి సినిమాలు చూసి ఆయనలా మారాలనే సంకల్పంతో వచ్చినవారే. రవితేజ , శ్రీకాంత్, ఉత్తేజ్, శివాజీరాజా, కృష్ణవంశీ ఇంకా ఈ లిస్ట్ చాలా పెద్దదే. ఇండస్ట్రీలోకి రావాలంటే గాడ్ ఫాదర్ ఉండాలన్న లెక్కను మార్చి టాలెంట్ ఉంటే చాలని ఆయన నిరూపించారు. సినిమాలే కాదు సమాజ సేవలోనూ చిరంజీవి ముందుంటారు. తనను ఇంతడివాడిని చేసిన దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు మెగాస్టార్.

అలాగే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా వేలాది ప్రాణాలను నిలబెట్టి.. తెలుగునాట రక్తదానం ఈ స్థాయిలో పెరగడానికి కారణమయ్యారు. ప్రకృతి విపత్తుల సమయంలో చిత్ర పరిశ్రమ నుంచి ముందుగా స్పందించేది చిరంజీవే. వ్యక్తిగతంగా విరాళాలు ఇవ్వడంతో పాటు ఛారిటీ ఈవెంట్స్, స్టార్ క్రికెట్ వంటి కార్యక్రమాల ద్వారా వచ్చిన సొమ్మును బాధితులకు అందజేయడంలోనూ ఆయన ముందుంటారు. చిత్ర పరిశ్రమలోని పేద కళాకారులు, సీనియర్ నటులు ఎంతోమందిని చిరంజీవి ఆదుకున్నారు.
సామాన్యులే కాదు.. ప్రముఖులు కూడా చిరంజీవి అభిమానులే . తెలుగునాట రాజకీయాల్లో ఉన్న ఈ తరంలోని చాలా మంది నేతలు మెగాస్టార్ సినిమాలు చూస్తూ పెరిగినవారే. తాజాగా చిరంజీవిపై అభిమానం చాటుకున్నారు టీడీపీ నేత, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న ఆయన బ్లాక్బస్టర్ మూవీ ఇంద్రను 4కే వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.
తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 థియేటర్లలో ఇంద్రను రీ రిలీజ్ చేశారు. దీంతో తెలుగునాట మెగా అభిమానులు సందడి చేశారు. చిరంజీవి భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి తీన్మార్ డ్యాన్సులు, బాణాసంచా కాల్చారు. మెగాస్టార్ పుట్టినరోజు కావడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకులకు స్వీట్లు పంచిపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి థియేటర్కు చేరుకుని ఇంద్ర సినిమాను చూశారు. అక్కడితో ఆగితే ఏముంది.. తన కాలేజ్ డేస్ను గుర్తుచేసుకున్నారో ఏమో కానీ తాను కూడా కుర్రాడిలా మారిపోయాడు. ఈలలు వేస్తూ.. స్క్రీన్పై చిరంజీవి కనిపించినప్పుడల్లా పేపర్లు చించి విసిరేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











