ప్రముఖ నటుడు, డైరెక్టర్ ఎన్ శివప్రసాద్ ఇక లేరు.. తీవ్ర విషాదంలో తెలుగు సినీ పరిశ్రమ
సినీ నటుడు, డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ నేత, చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ శని వారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో సినీ, రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతూ
గత కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నారు శివప్రసాద్. కొన్ని రోజులుగా దీనికి చికిత్స పొందుతున్నారు. అయితే క్రమంగా ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లుగా తెలిసింది.

నారమల్లి శివప్రసాద్కి సినీ రంగంతో అనుబంధం
నారమల్లి శివప్రసాద్కి సినీ రంగంతో మంచి అనుబంధం ఉంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే ఆయన రెండుసార్లు చిత్తూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

నటుడిగా నారమల్లి శివప్రసాద్
నటుడిగా నారమల్లి శివప్రసాద్ ఎన్నో సినిమాల్లో నటించారు. తులసి, మస్కా, ద్రోణ, డేంజర్, ఖైదీ, జై చిరంజీవ, బాలు, బలాదూర్, సుభాష్ చంద్రబోస్ లాంటి సినిమాల్లో నటించి మెప్పు పొందారు శివప్రసాద్. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో ఆయన నటన ఆకట్టుకుంది.

నిర్మాతగా, దర్శకుడిగా కూడా
ఖైదీ సినిమా నుంచే నిర్మాతగా మారి పలు సినిమాల నిర్మాణాల్లో భాగమయ్యారు నారమల్లి శివప్రసాద్. దర్శకుడిగా కూడా ఆయన ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కరికో లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇలా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన సినీప్రస్థానం కొనసాగింది.

సినీ ప్రముఖుల పరామర్శ
నారమల్లి శివప్రసాద్ మరణవార్తతో సినీ లోకంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. నారమల్లి శివప్రసాద్ తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











