Hamsa Nandini: క్యాన్సర్ బారిన పడిన టాలీవుడ్ హీరోయిన్.. సర్జరీలు జరిగినా కష్టమే.. పరిస్థితి దారుణం
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్న హీరోయిన్లలో హంసా నందిని ఒకరు. చాలా కాలం పాటు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె.. చిన్న హీరోలతో కాకుండా, బడా స్టార్లతో సైతం స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే, కొంత కాలంగా ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటోంది.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనే అప్డేట్లు ఇస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హంసా నందిని.. తాను క్యాన్సర్తో బాధ పడుతున్నానని చెప్పి అందరికీ షాకిచ్చింది. అంతేకాదు, తన పరిస్థితిని వివరిస్తూ సుదీర్ఘమైన ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇంతకీ ఆమెకు ఏం జరిగింది? ఇప్పుడు హంసా పరిస్థితి ఎలా ఉంది? ఆ వివరాలు చూద్దాం పదండి!

అలా పరిచయం.. మంచి గుర్తింపుతో
మహారాష్ట్రకు చెందిన హంసా నందిని మొదట మోడల్గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆ రంగంలో తనదైన ఫిగర్తో అందరి దృష్టినీ ఆకర్షించి గుర్తింపును అందుకుంది. అప్పుడే 'ఒకటవుదాం' అనే తెలుగు చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయింది. అయితే, వంశీ దర్శకత్వంలో వచ్చిన 'అనుమానాస్పదం' మూవీతోనే ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అప్పటి నుంచి సినిమాలకు దూరం
కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న చిత్రాల్లో హీరోయిన్గా నటించిన హంసా నందిని.. ఆ తర్వాత బడా హీరోలతోనూ కలిసి పని చేసింది. ఈ క్రమంలోనే 'మిర్చి', 'లెజెండ్', 'అత్తారింటికి దారేది' వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. అలాగే, ఎన్టీఆర్తో 'జై లవ కుశ', గోపీచంద్తో 'పంతం' చిత్రాలు చేసిన తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో
హంసా నందినికి తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా భాషల్లో మంచి గుర్తింపు ఉంది. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది. దీంతో ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అలాగే, తనకు, తన కెరీర్కు సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటూ వస్తోందీ హీరోయిన్.

క్యాన్సర్ అంటూ ప్రకటించిన హంసా
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే హంసా నందిని.. తాజాగా తాను క్యాన్సర్తో బాధ పడుతున్నానని ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు గుండుతో ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు, ప్రస్తుతం తాను ఏ పరిస్థితిలో ఉన్నానో వివరిస్తూ సుదీర్ఘమైన లేఖలను కూడా వదిలింది. దీంతో ఆమె అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆందోళన చెందుతున్నారు.

ఆ భయంతోనే బతుకున్నాను అని
హంసా నందిని తాజాగా వదిలిన లేఖలో 'కాలం నా జీవితంలో ఏవిధమైన ప్రభావాలు చూపినా.. బాధితురాలిగా ఉండాలనుకోవడం లేదు. భయం, ప్రతికూల భావాలతో జీవించను. ధైర్యంగా ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ముందడుగు వేయాలనుకుంటున్నా. 18 సంవత్సరాల క్రితం క్యాన్సర్తో నా తల్లి కన్నుమూశారు. నాటి నుంచి నేను అదే భయంతో బతుకుతున్నా' అని తెలిపింది.

నాలుగు నెలల క్రితమే.. మూడో స్టేజ్
తనకు క్యాన్సర్ గురించి ఎప్పుడు తెలిసిందో హంసా నందిని వివరించింది. 'నాలుగు నెలల క్రితం నా రొమ్ములో కణతి ఉన్నట్లు అనిపించింది. దీంతో వెంటనే వైద్యుల్ని సంప్రదించాను. వాళ్లు కొన్ని పరీక్షలు చేసిన అనంతరం నాకు రొమ్ము క్యాన్సర్.. గ్రేడ్-3 దశలో ఉన్నట్లు చెప్పారు. తర్వాత నాకు ఒక సర్జరీ చేసి ఆ కణతిని కూడా తొలగించారు' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

సర్జరీ చేయించినా.. షాకింగ్ న్యూస్
సర్జరీ తర్వాత ఏం జరిగిందో చెబుతూ.. 'సర్జరీతో క్యాన్సర్ తగ్గిపోయిందన్న ఆనందం ఆవిరైంది. జన్యుపరమైన క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు తాజాగా నిర్ధారించారు. దాని వల్ల నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 70శాతం, గర్భాశయ క్యాన్సర్ బయటపడే అవకాశం 40 శాతం ఉంది. దాని నుంచి తప్పించుకోవాలంటే సర్జరీలు చేయించుకోవాలట' అని హంసా నందిని చెప్పింది.
Recommended Video

మహమ్మారికి అంకితం చేయనంటూ
తన పరిస్థితిని వివరించిన హంసా నందిని 'ప్రస్తుతానికి 9 విడతల కిమోథెరపీలు చేయించుకున్నాను. మరో ఏడు చేయించుకోవాల్సి ఉంది. ఈ మహమ్మారికి నా జీవితాన్ని అంకితం చేయాలనుకోవడం లేదు. నవ్వుతూ ధైర్యంగా పోరాడాలనుకుంటున్నా. సంపూర్ణ ఆరోగ్యంతో మరలా మీ ముందుకువస్తా. అందరిలో ప్రేరణనింపడానికే నా కథ చెబుతున్నా' అని వెల్లడించింది.
ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్నా.. తోటి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్న హంసా నందిని త్వరగా కోలుకోవాలని ఫిల్మీబీట్ కోరుకుంటోంది.


Click it and Unblock the Notifications











