ఎన్టీఆర్కు జరిగిన అవమానం, వెక్కి వెక్కి ఏడ్చా.. పూరి జగన్నాథ్, సెలెబ్రిటీలు ఏమన్నారంటే!
Recommended Video

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు శుక్రవారం విడుదల అవుతోంది. ఇటీవల ట్రైలర్ కూడా విడుదుల చేశారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. పార్టీ స్థాపించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం, దేశ రాజకీయాలని సైతం మలుపు తిప్పేలా అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం లాంటి విశేషాలు ఎన్టీఆర్ మహానాయకుడులో ఉండబోతున్నాయి. ఈ చిత్ర విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూద్దాం!

సంకల్ప బలంతో
ఎన్టీఆర్ మహానాయకుడు చిత్ర స్పెషల్ స్క్రీనింగ్ కు టాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ముందుగా బాలకృష్ణ మాట్లాడుతూ.. మీరే చెప్పాలి సినిమా ఎలా ఉందొ.. చూశారు కదా అని సరదాగా మీడియాతో వ్యాఖ్యానించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సంకల్ప బలంతో ఎన్టీఆర్ అనుకున్నవి సాధించారని బాలయ్య అన్నారు. ఆ అంశాలనే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో చూపించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ మహానాయకుడు మంచి విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.

గొంతు తడి ఆరిపోయింది
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం చూడగానే నా గొంతు ఉవ్వెత్తున ఎగసింది. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం చూడగానే నా గొంతు తడి ఆరిపోయింది. అందులో సెంటిమెంట్, ఎమోషన్, మా బసవతారకమ్మని అలా చూడగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. చిత్రం హార్ట్ టచింగ్ గా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ జీవితంలో ఇంకో అంకం కూడా ఉంది. కానీ బాలయ్య ఒక అంకం మాత్రమే చూపించారు అంటూ పరోక్షంగా లక్ష్మీపార్వతి ఎపిసోడ్ గురించి వ్యాఖ్యలు చేశారు.

మూడుసార్లు భోజనం
నేను తారకమ్మ దగ్గర మూడుసార్లు భోజనం చేశా. ఈ చిత్రంలో ఆ మహాతల్లిని ఇలా చూడగానే నాకు మాటలు రావడం లేదు అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తపరిచారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ.. కరిగిపోయిన కాలాన్ని మళ్ళీ చూశాం. ఎన్టీఆర్ మననుంచి వెళ్లిపోలేదనే విషయాన్ని బాలయ్య ఈ చిత్రం ద్వారా మనకు తెలియజేశారు అని అన్నారు.

వెక్కి వెక్కి ఏడ్చా
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం నాకు ఎంతగా నచ్చిందో అంతకంటే ఎక్కువగా మహానాయకుడు చిత్రం నచ్చిందని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. బసవతారకం గురించి చెప్పే డైలాగ్ తో నేను ఏడ్చాను. ఇక ఎన్టీఆర్ కు అసెంబ్లీలో జరిగిన అన్యాయం చూసి వెక్కి వెక్కి ఏడ్చాను అని పూరి అన్నారు. మహానాయకుడు చిత్రం ఎంత గొప్పదో, బాలయ్య నటన అంత గొప్పది. బాలయ్య కెరీర్ లో ది బెస్ట్ ఫిలిం ఇది అని అన్నారు.

డిజప్పాయింట్ అయ్యా
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. వాస్తవంగా చెప్పాలంటే పార్ట్ 1 చూసి నేను డిజప్పాయింట్ అయ్యా. కానీ పార్ట్ 2 అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయాల గురించి టీవీలలో, పేపర్లలో మనం చూశాం. మహానాయకుడు చిత్రంలో ఆ సన్నివేశాలు చూస్తుంటే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. హీరోయిన్ ఛార్మి మాట్లాడుతూ తాను ఎన్టీఆర్ గారికి సంబందించిన కొన్ని వీడియోలు చూశానని తెలిపింది. మహానాయకుడు చిత్రంలో బాలకృష్ణగారిని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. ప్రతి ఒక్కరికి ఈ చిత్రం నచ్చుతుందని భావిస్తున్నట్లు చార్మి తెలిపింది.

నారా బ్రాహ్మణి
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో తాతగారు తెలుగు సినిమాకు ఎలాంటి గుర్తింపు తీసుకువచ్చారో చూశాం. ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో ఆయన తెలుగు జాతి మొత్తానికి గుర్తింపుని, గౌరవాన్ని ఎలా తీసుకుని వచ్చారో చూపించడం జరిగింది అని నారా బ్రాహ్మణి తెలిపారు. ఈ విషయంలో ముందుగా మా నాన్నకు కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నట్లు బ్రాహ్మణి తెలిపింది.


Click it and Unblock the Notifications











