క్యూ కట్టారు, కేసీఆర్ చల్లని చూపు కోసం సినీతారలు ఇలా..!
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ సంక్లిష్టమైన, గంధరగోళ పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు తరచూ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పరిశ్రమ హైదరాబాద్ నుండి వేరే ప్రాంతానికి తరళి వెళ్లే అవకాశం ఉందని కొందరు చెబుతుంటే....హైదరాబాద్లో సొంత సినీ స్టూడియోలు కలిగిన నాగార్జున లాంటి వారు మాత్రం అలాంటిదేమీ ఉండదు. పరిశ్రమ హైదరాబాద్లోనే ఉంటుందని గత కొంతకాలం చెబుతూ వస్తున్నారు.
ఇంతలోనే ఎన్నికలు జరిగాయి...ఫలితాలు కూడా వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం(హైదరాబాద్)లో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని పలువురు తెలుగు సినిమా ప్రముఖులు కేసీఆర్ను బుధవారం కలిసారు.

ముఖ్యమంత్రి కాబోతున్న కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా తెలుగు సినీ పరిశ్రమపై మీ చల్లని చూపు ఉండాలని కోరినట్లు సమాచారం. కేసీఆర్ను కలిసిన వారిలో నిర్మాతలు రామానాయుడు, సురేష్ బాబు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్, నిర్మాత కెఎస్ రామారావు, అలీ తదితరులు ఉన్నారు.
కొత్త రాష్ట్రంలో సినిమా పరిశ్రమ మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని, పరిశ్రమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటామని, మంచి ప్రోత్సాహకాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కేసీఆర్ ఇచ్చిన హామీతో పరిశ్రమ వర్గాల్లో సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











