Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టాలీవుడ్ 2019 : చిత్ర సీమలో విషాదం.. కూలిన దర్శక దిగ్గజాలు
టాలీవుడ్లో ఈ ఏడాది విషాద చాయలు అలుముకున్నాయి. నాటి దర్శక దిగ్గజాలు నేలకూలాయి. గతేడాది దర్శక రత్న దాసరి నారాయణ రావు మరణించగా.. ఈ ఏడాది మరికొంత మంది దర్శకులు మృతి చెందారు. వరుసగా ఇలా దర్శకులు కాలం చెల్లిపోవడంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ ఏడాదిలో విజయ బాపినీడు, కోడి రామకృష్ణ, విజయ నిర్మల లాంటి గొప్ప దర్శకులు స్వర్గస్తులయ్యారు.
గ్యాంగ్ లీడర్ దర్శకుడు మృతి..
మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందించారు. చిరంజీవితో పట్నం వచ్చిన పతివ్రతలు, మగ మహారాజు, మహానగరంలో మాయగాడు, హీరో, మగధీరుడు, ఖైదీ నంబర్ 786ను విజయ బాపినీడు తెరకెక్కించాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్' ఇప్పటికీ ఎవర్గ్రీన్ సినిమానే. 1936 సెప్టెంబర్ 22న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం జన్మించిన బాపినీడు.. మొదటగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండేవారు.
అలా ఇండస్ట్రీలోకి
ఏలూరు సీఆర్ఆర్ కాలేజీలో బీఏ పూర్తిచేసిన బాపినీడు.. కొంతకాలం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. తరవాత చెన్నైలో ‘బొమ్మరిల్లు', ‘విజయ' మ్యాగజైన్లను ప్రారంభించారు. ‘విజయ'లో వచ్చిన బాపినీడు సినిమా రివ్యూలు అప్పట్లో విపరీతంగా ప్రేక్షకాదరణ పొందాయి. దీంతోనే ఆయన పేరు విజయ బాపినీడుగా మారింది. ఆ తరవాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాపినీడు.. 1981లో దర్శకుడిగా మారారు. కొన్ని దశాబ్దాల పాటు చిత్ర సీమను ఏలిన విజయ బాపినీడు.. 2019 ఫిబ్రవరి 12న మృతి చెందారు.
చిరు సినిమాతోనే దర్శకుడిగా ఎంట్రీ..
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ చిరంజీవితో చేసిన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో దర్శకుడిగా జీవితాన్ని ప్రారంభించారు.30 ఏళ్ల సినీ ప్రస్థానంలో కోడి రామకృష్ణ అనేక విజయవంతమైన చిత్రాలను అందించారు. నటులు అర్జున్, భానుచందర్, సుమన్, జీవితలను ఆయన చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఉమ్మడి ఆంధప్రదేశ్ ప్రభుత్వం 2012లో ఆయనను రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది.
గ్రాఫిక్స్ చిత్రాలకు ఆద్యుడు..
దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ కోడి రామకృష్ణ రాణించారు. 'దొంగాట', 'ఆస్తి మూరెడు ఆశ బారెడు', 'అత్తగారూ స్వాగతం', 'ఇంటి దొంగ', 'మూడిళ్ల ముచ్చట' చిత్రాల్లో ఆయన నటనతో ప్రేక్షకులను అలరించారు. గ్రాఫిక్స్ చిత్రాలకు తెలుగులో మంచి మార్కెట్ను క్రియేట్ చేశారు. అమ్మోరు, దేవీ, అరుంధతి లాంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఆయన దర్శకతం వహించిన చివరి చిత్రం నాగహరువు. దీన్ని 2016లో కన్నడంలో తీశారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో ప్రయోగాలు చేసిన కోడి రామకృష్ణ 2019, ఫిబ్రవరి 22న మరణించి స్వర్గస్తులయ్యారు.
గిన్నీస్ రికార్డులకెక్కిన దర్శకురాలు..
బాలనటిగా కెరీర్ ప్రారంభించి, సినీ రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని హీరోయన్ గా, దర్శకురాలిగా, నిర్మాతగా.. తన సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించిన ఘనత ఆమెకే చెల్లింది. మీనా సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న విజయ నిర్మల..దాదాపు 40కి సినిమాలను డైరెక్ట్ చేసింది.
దు:ఖాన్ని ఆపుకోలేకపోయిన కృష్ణ
1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో జన్మించిన విజయ నిర్మల.. 2019 జూన్ 27 మరణించారు. తన మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత ఆమె కృష్ణని రెండో వివాహం చేసుకున్నారు. ప్రముఖ నటుడు నరేష్ విజయ నిర్మల కొడుకు. ఆమె మొదటి భర్త వలన కలిగిన సంతానం. అప్పటికే కృష్ణ, విజయ నిర్మలకు విడి విడిగా సంతానం ఉండటం చేత వీళ్లిద్దరు మాత్రం సంతానం వద్దనుకున్నారు. విజయ నిర్మల మరణంతో కృష్ణ దు:ఖాన్ని ఆపుకోలేకపోయి భోరున ఏడ్చేశారు.
ఎందరో హీరోలను తయారు చేసిన గురువు..
దేవదాస్ కనకాల (జూలై 30, 1945 - ఆగస్టు 2, 2019) నటుడు, దర్శకుడే కాకుండా.. నటనలో ఎంతో మందికి శిక్షణనిచ్చి స్టార్ హీరోలుగా తీర్చిదిద్దాడు. నాటక దర్శకత్వం నుండి సినిమా దర్శకునిగా ఎదిగాడు. పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో విద్య అభ్యసించిన తొలితరం తెలుగువారిలో దేవదాస్ ఒకరు. చలిచీమలు అనే ఒక్క చిత్రాన్ని మాత్రమే తెరక్కించారు. అయితే అది అంతగా విజయం సాధించకపోయే సరికి దర్శకత్వ ఆలోచన చేయలేదు.
స్టార్ హీరోలను తయారు చేసిన గురువు..
దేవదాస్ వద్ద రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, నాజర్, ప్రదీప్ శక్తి, భానుచందర్, అరుణ్పాండ్యన్, రాంకీ, రఘువరన్ వంటి సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా శిక్షణ పొందారు. ప్రముఖ నటుడు రాజీవ్ కనకల ఈయన కుమారుడే.