Allu Arjun : పోలీసుల అదుపులో హీరో అల్లు అర్జున్ .. పీఎస్కు తరలింపు
సినీనటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిక్కుల్లో పడ్డారు. కొద్దిరోజుల క్రితం పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వివాహిత మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా అల్లు అర్జున్ను హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ వ్యాన్లోనే అల్లు అర్జున్ను చిక్కడపల్లి పీఎస్కు తరలించారు. ఈ పరిణామాలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది.
పుష్ప 1కి సీక్వెల్గా పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల అవుతుండగా.. డిసెంబర్ 4నే ఓవర్సీస్ సహా భారతదేశంలోని కొన్ని ఎంపిక చేసిన స్క్రీన్లలో ప్రీమియర్స్, స్పెషల్ షో, బెనిఫిట్ షోలు వేశారు. నిర్మాతలు టికెట్ రేట్ ఎంతైనా సరే పెట్టి కొనేందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెనుకాడలేదు. సాయంత్రం నుంచే థియేటర్లకు అభిమానులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. దీనిలో భాగంగా తెలుగు నాట సినిమాలకు పెట్టింది పేరైన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏరియాలోని సంధ్య థియేటర్లోనూ స్పెషల్ షో వేశారు.

అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకోగా.. కాసేపటికి అల్లు అర్జున్ తన కుటుంబం, సన్నిహితులతో అక్కడికి చేరుకున్నారు. ఆయనను చూడగానే ఫ్యాన్స్ ఫోటోలు, సెల్ఫీలతో పాటు కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. దీంతో అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది వారిని పక్కకు నెట్టేసే క్రమంలో తోపులాట జరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి అనే మహిళ కుటుంబ సభ్యులు కిందపడిపోయారు. ఈ ఘటనలో వారికి ఊపిరి ఆడకపోవడంతో వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది వారిని బయటికి లాగారు.

రేవతి అప్పటికే అపస్మారక స్థితిలో వెళ్లిపోగా .. ఆమె కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సీపీఆర్ చేసి దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తూ రేవతి మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. మరోవైపు.. తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. అలాగే తొక్కిసలాటపై అల్లు అర్జున్, సుకుమార్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంధ్య ధియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసుల అదుపులో అల్లు అర్జున్ #AlluArjun #SandhyaTheatre #HyderabadPolice #Oneindiatelugu pic.twitter.com/nMv0B2KVyo
— oneindiatelugu (@oneindiatelugu) December 13, 2024
మరోవైపు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హీరో అల్లు అర్జున్, అతని సిబ్బందిపైనా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనపై సెంట్రల్ జోన్ డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తమకు సమాచారం ఇవ్వకపోగా.. పెద్ద ఎత్తున గుమిగూడిన అభిమానులను అదుపు చేసేలా ముందస్తు భద్రతను ఏర్పాటు చేయకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగానే అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయనను అరెస్ట్ చేశారా? లేక విచారణ కోసం పీఎస్కి తీసుకెళ్లారా? అన్నది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











