టాలీవుడ్ వివాదాస్పద నిర్ణయం: ఆ మూడు ఛానళ్లకే యాడ్స్!
హైదరాబాద్: ప్రస్తుత కాలంలో సినిమాలకు ప్రచారం కల్పించాలంటే ప్రధాన మాధ్యమం టీవీ ఛానళ్లు, ఇంటర్నెట్, వార్తా పత్రికలు. ఈ మూడింటిలో టీవీ ఛానళ్లలో యాడ్స్ వల్లనే సినిమా గురించి ప్రచారం ప్రేక్షకుల వరకు వెలుతోంది. అదే సమయంలో కుప్పలు తెప్పలుగా ఛానల్స్ ఉండటం వల్ల ప్రకటనలకు పెట్టే ఖర్చుకు కూడా తడిసి మోపెడవుతోందట.
ఒక్కో సినిమాకు కేవలం టీవీ ప్రకటనల ఖర్చు దాదాపు 40 లక్షల వరకు అవుతోందని అంటున్నారు. దీంతో సినిమా ప్రచార ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచనకు వచ్చిన కొందరు పెద్ద నిర్మాతలు ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్పీ రేటింగులు ఎక్కువగా ఉన్న టీవీ 9, ఎన్టీవీ, టీ న్యూస్ ఛానల్స్ కు మాత్రమే యాడ్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అయితే కేవలం ఈ మూడు ఛానళ్లకే ప్రకటనలు ఇవ్వడం ఏమిటి? మిగిలిన ఛానళ్లపై వివక్ష చూపడం తగదు....ఇస్తే అందరికీ సమానంగా ఇవ్వండి, లేకుంటే ఎవరికీ ఇవ్వొద్దు అని కొందరు వాదిస్తున్నారు. అయితే భారీ బడ్జెట్ పెద్ద సినిమాలకు రూ. 40 లక్షలు ప్రచారం కోసం ఖర్చు పెట్టడం పెద్ద విషయం ఏమీ కాదు. సమస్య వచ్చిందల్లా రూ. 1 నుండి 3 కోట్ల బడ్జెట్ తో నిర్మించే సినిమాలకే అంటున్నారు.
ఈ వివాదాస్పద నిర్ణయం వెనక తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఆ నలుగురు పెద్ద నిర్మాతలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ వివాదాస్పద నిర్ణయం అమలు అయితే మాత్రం సినిమాలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అంటున్నారు. మరి ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications