ఓటీటీ రిలీజ్ విషయంలో టాలీవుడ్ నిర్మాతల కీలక నిర్ణయం.. ఇక అన్ని రోజులు ఆగాల్సిందే!
గత కొంత కాలంగా తెలుగు సినిమాలు ఓటీటీలో ఎప్పుడు విడుదల చేయాలి అనే విషయం మీద సందిగ్ధం కొనసాగుతోంది. సినిమా విడుదలైన 15- 20 రోజుల్లోపే కొంత మంది నిర్మాతలు ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి సిద్ధమవుతుంటే మరికొందరు మాత్రం 50 రోజుల తర్వాత విడుదల చేస్తామని విడుదల సమయంలోనే చెబుతున్నారు. కొంతమంది ముందు కొంతమంది తర్వాత చేయడం వల్ల థియేటర్ పరిశ్రమలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఉద్దేశంతో సినీ నిర్మాతలు తాజాగా భేటీ అయ్యారు. ఒటీటీలో విడుదల ఎప్పుడు చేయాలి అనే విషయం మీద ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే

జూలై 1 నుంచి
డిజిటల్ వేదికగా ఓటీటీలో కొత్త సినిమాలు విడుదల చేసే విషయం మీద తెలుగు సినీ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దియేటర్లలో సినిమాలు విడుదలై 50 రోజులు పూర్తయిన తర్వాతే సినిమాలు డిజిటల్ వేదికగా రిలీజ్ కు ఇచ్చేలా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే జూలై 1 నుంచి జరిగే ఒప్పందాల విషయంలో అన్ని సినిమాల నిర్మాతలు ఈ ఒక రూల్ పాటించాల్సి ఉంటుందని నిర్ణయం తీసుకున్నారు.

సినీ హీరోల క్రేజ్ కూడా
భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమేకాక చిన్న బడ్జెట్ సినిమాల వరకూ అన్నీ విడుదలైన కొద్ది రోజులకే డిజిటల్ వేదికగా అందుబాటులోకి వచ్చేయడం అనేది థియేటర్ల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు నిర్మాతలు నిర్మాతల మండలి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే విడుదల అయిన కొద్ది రోజులకే ఆన్లైన్లో సినిమాలు వస్తే థియేటర్ల క్రేజ్ తగ్గటమే కాక సినీ హీరోల క్రేజ్ కూడా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

నెలలోపే థియేటర్లలో
ఈ క్రమంలో బుధవారం నాడు సమావేశమైన సినీ నిర్మాతలు ఇక మీదట సినిమా విడుదలైన 50 రోజుల తరువాతే డిజిటల్ లో విడుదల చేసే విధంగా ఓటీటీ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. నిజానికి చాలా సినిమాలు థియేటర్ లో విడుదలైన తరువాత ఆ సినిమాకి మంచి టాక్ రాకపోతే నెలలోపే థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఉదాహరణకు సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా ఈనెల 17వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

ముందే ఇవ్వకుండా
ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం దారుణమైన ఫెయిల్యూర్ చూడాల్సిన పరిస్థితి. అయితే నెలలోపు విడుదల చేస్తే ఓటీటీ సంస్థలు కాస్త డబ్బులు ఎక్కువ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో నిర్మాతలు కూడా సినిమాలను సదరు ఓటీటీ సంస్థలకు ముందే ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మీదట అలాంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video


ఇబ్బంది పడకుండా
దీనికి సంబంధించి త్వరలో నిర్మాతల మండలి మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేతనాల విషయంలో కూడా సినీ కార్మికులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు సినీ నిర్మాతలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఓటీటీ వల్ల తాము కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











