Sarathi: టాలీవుడ్ లో మరో విషాదం.. జగన్మోహిని కమెడియన్ కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో మరొ విషాదం చోటుచేసుకుంది. తన కామెడీతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ కమెడియన్ సారధి గారు నేడు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్న సారథి అంటే తెలియని సినీ ప్రముఖులు ఉండరు. కేవలం ఒక నటుడిగానే కాకుండా ఆయన చిత్ర పరిశ్రమలో ఎన్నో సంక్షేమ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారు. సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవ ఎన్నటికీ మరువలేనిది అని చాలామంది సినీ ప్రముఖులు చెబుతూ ఉంటారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉదయమే కన్నుమూత
గత కొంతకాలంగా వయసు రీత్యా కొంత అనారోగ్యంతో బాధపడుతున్న సారథి నేడు ఉదయం హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు కడలి జయ సారధి. ఇటీవల 83వ వసంతంలో అడుగుపెట్టిన ఆయన హఠాత్తుగా కన్నుమూయడం అందరిని షాక్ గురి చేసింది. సినిమాలకు స్వస్తి చెప్పిన అనంతరం ఆయన ఎక్కువగా తన సొంత గ్రామంలో వ్యవసాయానికి సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయి ఆనందంగా జీవనాన్ని కొనసాగించారు. ఇక ఇటీవల కొంత అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

372 చిత్రాలు
1960లో సీతారామ కళ్యాణం అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన సారది గారు ఆ తర్వాత అనేక సినిమాల్లో హాస్య పాత్రల్లో కనిపించి ఎంతగానో మెప్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన దాదాపు 372 సినిమాల్లో నటించారు. ఇక సినిమా పరిశ్రమకు ఆయన ఎంతో ఉపయోగపడ్డారు అని చెప్పాలి. ముఖ్యంగా అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమ అంటే మద్రాసులోనే ఉండేది ఇక సీనియర్ నటీనటులు అందరూ కూడా ఎలాగైనా తెలుగు రాష్ట్రంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఉండాలి అని చేసిన కృషికి ఆయన కూడా అందులో క్రియాశీలకంగా వ్యవహరించారు.

నటన రంగంలో ఆయన సేవలు
మద్రాసు నుండి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బలపడడంలో కూడా ఆయన పాత్ర ఎంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సంస్థకు కూడా ఆయన వ్యవస్థాపక కోశాధికారిగా కూడా పనిచేశారు. నాటక రంగంలో ఆయన ఎన్నో సేవలు చేశారు. నరసింహ రావు, రేలంగి, వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి మహానటులతో కూడా ఆయన నాటక రంగంలో కలిసి నటించారు.

ఆ సినిమాతో ఎక్కువ గుర్తింపు
ఇక సారధి నటించిన సినిమాల్లో ఎక్కువగా అందరికీ గుర్తుండిపోయేది మాత్రం జగన్మోహిని అనే చెప్పాలి. విఠలాచార్య దర్శకత్వంలో 1978లో వచ్చిన జగన్మోహిని సినిమాలో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందులో సారది దెయ్యాలను చూసి భయపడే విధానం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అంతేకాకుండా మన ఊరి పాండవులు, కోతల రాయుడు, భక్త కన్నప్ప ఇలా ఎన్నో సినిమాల్లో ఆయన చేసిన హాస్య పాత్రలు ఎన్నటికీ కూడా మర్చిపోలేనివి.

నిర్మాతగా కూడా
అయితే సారధి గారు కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించారు. ధర్మాత్ముడు. అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు అనే చిత్రాలను నిర్మించిన ఆయన మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. అలాగే సారధి గారికి ఆయన కృష్ణంరాజు గారు నిర్మించిన చాలా సినిమాలకు మ్యూజిక్ సిటింగ్స్ లో పాల్గొంటు పనులను దగ్గరుండి చూసుకునేవారు.

కృష్ణంరాజుతో అనుబంధం
ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణంరాజుతో సారథి ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కృష్ణంరాజుతో తరచుగా ఆయనతో ఒక సోదర భావంతో కనిపించేవారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో పేద సినీ కార్మికులకు కూడా ఆయన చాలాసార్లు అండగా నిలిచారు. ముఖ్యంగా చిత్రపురి కాలనీ నిర్మాణంలో కూడా సారది కీలకపాత్ర పోషించారు. ఇక పఠాత్తుగా ఆయన మరణించడంతో సినీ ప్రముఖులు అభిమానులు శ్రేయోభిలాషులు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో ఫోటోలను కూడా షేర్ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











