Vakeel Saab టికెట్ల లొల్లి.. చేతులెత్తేసిన డిస్ట్రిబ్యూటర్లు.. వైఎస్ జగన్తో చిరంజీవి, సినీ పెద్దల సమావేశం?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన థియేటర్ టికెట్ రేట్ల నియంత్రణ జీవో సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వకీల్ సాబ్ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు మధ్య మొదలైన వివాదం తారస్థాయికి వెళ్లడంతో ప్రభుత్వం అప్పటికప్పుడు అర్ధరాత్రి సమయంలో టికెట్ రేట్ల నియంత్రణ జిఓ ఒకటి జారీ చేసింది. ఈ జీవో ప్రకారం రేట్లు ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు రిలీజ్ చేయడం అవసరమా ? డిస్ట్రిబ్యూటర్లు వాదిస్తున్నారు. ఇలాగే ఉంటే మా వల్ల కాదని వారంతా చర్చించుకుని సినీ పెద్దలకు ఒక సందేశం ఇచ్చారు. పరిస్థితి ఇలానే ఉంటే తాము ఇక సినిమాలు రిలీజ్ చేయలేమని చెప్పేశారట.

రాజకీయంగా టార్గెట్ అవుతామన్న భావనతో
థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసికట్టుగా సినీ పెద్దలను కలిసి ఈ విషయం చెప్పడంతో పాటు ఈ జీవో అంశం మీద ప్రభుత్వం తమతో చర్చలు జరిపేందుకు ఏ మాత్రం సుముఖంగా లేదని ఈ విషయం మీద ఏదైనా చేయాలంటే మీరు చేయగలరు అని, సినీ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా విషయంలో రేట్లు నియంత్రించి తర్వాత సినిమాలకు వదిలేస్తే ఇబ్బంది అవుతుందని, రాజకీయంగా టార్గెట్ అవుతామన్న భావనతో భవిష్యత్ సినిమాలు కూడా ఇవే రేట్లు కొనసాగించాలని భావిస్తోంది.

భారీగా నష్టపోక తప్పదు
అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లో కలెక్షన్లు ఏ మాత్రం ఉండవు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలు విడిపోయినా సరే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందని సినీ ట్రేడ్ వర్గాల లెక్క. తెలంగాణ వచ్చాక పది జిల్లాలను 33 జిల్లాలు చేసినా సరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాల కంటే తక్కువ ఆదాయమే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, సీడెడ్ ఏరియాల నుంచి భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్క చప్పున థియేటర్లలో టికెట్లు అమ్మితే సినీ పరిశ్రమ భారీగా నష్టపోక తప్పదు.

చిరంజీవి నేతృత్వంలో
ఈ నేపథ్యంలోనే సినీ పెద్దలు ఇప్పుడు జగన్ ను కలవాలని భావిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చెప్పుకున్న దాసరి మరణం తర్వాత కాస్త అన్ని విషయాల్లో చిరంజీవి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. కరోనా పరిస్థితులు నెమ్మదించాక షూటింగ్ కి అనుమతి ఇవ్వాలని, థియేటర్స్ కి అనుమతి ఇవ్వాలని కూడా ఈ బృందం జగన్ ను కలిసి వచ్చింది.

జగన్ అపాయింట్మెంట్ ఖరారు కాగానే
ఇప్పుడు ఇదే అంశంలో కూడా వీరు జగన్ మరోసారి కలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా ఉన్న సమయంలో సినిమాలు కాస్త వాయిదా పడవచ్చు. కానీ ఒకటి రెండు నెలల్లో చిరంజీవి ఆచార్య సినిమా మొదలు దాదాపు చాలా పెద్ద సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పుడు కనుక ఈ అంశాన్ని ఎవరూ పట్టించుకోకపోతే ఇవే రేట్లు కంటిన్యూ అవుతాయని అప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఇబ్బంది అవుతుందని సినీ పెద్దలు సైతం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఒక్కసారి జగన్ నుంచి అపాయింట్మెంట్ ఖరారు కాగానే ఈ బృందం జగన్ ను కలిసి టికెట్ రేట్ల విషయంలో తమకు కాస్త సానుకూలంగా ఉండేలా చూడమని కోరే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











