‘అలవైకుంఠపురములో’ పాయింట్ ఇదే.. సీక్రెట్ చెప్పేసిన త్రివిక్రమ్
ఈ సంక్రాంతికి సందడి చేయబోయే సినిమాల్లో 'అలవైకుంఠపురములో' ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. దీంతో ఈ సినిమా స్టోరీ ఏమై ఉంటుందా? ఈ సినిమా ఎలా ఉండబోతోందా? అనే దానిపై జనాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు.. మధ్యతరగతి వాడైన హీరో ఒక పెద్దింటికి వెళ్లి అక్కడి మనుషుల మధ్య అంతరాలను తొలగించే కథనే 'అలవైకుంఠపురములో' అనే టాక్ బయటకొచ్చింది.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సీక్రెట్ లీక్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రివిక్రమ్.. 'అలవైకుంఠపురములో' ఫ్లాట్ పాయింట్ ఏమిటనేది చెప్పేశారు. ఈ కథ ఉద్దేశం ఏంటో త్రివిక్రమ్ తనదైన శైలిలో చెబుతూ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. సంపదకు, ఐశ్వర్యానికి మధ్య ఉన్న తేడాను సరదాగా చెప్పే ప్రయత్నం 'అలవైకుంఠపురములో' ద్వారా చేసినట్లు త్రివిక్రమ్ వెల్లడించారు.

పెద్దింటికి వెళితే అది చాలా విశాలంగా ఉండే తప్ప.. అక్కడ కాసేపు కూర్చుంటే బోరు కొట్టేస్తుందని త్రివిక్రమ్ అన్నారు. పెద్ద వాళ్ల ఇంట్లో సంపద ఉంటుంది తప్ప ఐశ్వర్యం ఉండదని, అదే ఒక మధ్య తరగతి ఇంటికి వెళితే ఇల్లు చిన్నగా ఉన్నప్పటికీ అక్కడ ఆనందం ఉంటుందని త్రివిక్రమ్ అన్నారు. చిన్న ఇంట్లో సంపద లేకపోయినా ఐశ్వర్యం ఉంటుందని, సంపదకు ఐశ్వర్యానికి ఉన్న ఈ చిన్న తేడాను సరదాగా 'అలవైకుంఠపురములో' చెప్పే ప్రయత్నం చేశానని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఈ సంక్రాంతికి ఈ పాయింట్ ఎలా ఆకట్టుకుంటుందో!.


Click it and Unblock the Notifications











