..రాంబాబు రగడ: పూరీపై పిఎస్లో తెరాస ఫిర్యాదు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంపై తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పోలీసు గడప తొక్కారు. పలువురు తెరాస నేతలు సోమవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత దానయ్య పైన ఫిర్యాదు చేశారు. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం తెలంగాణ ప్రాంత ఉద్యమాన్ని కించపర్చేలా ఉందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్ మాట్లాడారు. సినిమా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ తల్లిని కించపర్చేలా ఉందన్నారు. రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టేలా దర్శకుడు, నిర్మాత కుట్ర చేశారని ఆరోపించారు. అభ్యంతకర సన్నివేశాలను తొలగించకుండానే సినిమాను ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా తెలంగాణ రాష్ట్ర సమితి కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంపై తొలి నుండి మండిపడుతోంది. సినిమాలో తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చే విధంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి సినిమా ప్రదర్శిస్తామని చెప్పిన దర్శకుడు వాటిని తొలగించకుండానే సినిమాను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారని తెరాస నేతలు నిప్పులు చెరిగారు. ఉద్యమాన్ని కించపర్చేలా ఉన్న సన్నివేశాలు తొలగించడంతో సరిపోదని, సినిమానే బ్యాన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేలా సినిమా తీశారని నిప్పులు చెరిగారు.
కాగా చిత్రంపై వివాదం చెలరేగడంతో తాను తీవ్రంగా నష్టపోయానని నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అంతకముందు అన్నారు. సినిమాపై తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేయడంతో వారికి అభ్యంతరంగా ఉన్న సన్నివేశాలను తొలగించామని చెప్పారు. ఈ సినిమా వివాదం అనుకోకుండా జరిగిన సంఘటన అన్నారు. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి ఈ రోజు నుండి థియేటర్లకు పంపిస్తున్నట్లు చెప్పారు.
అభ్యంతరకర సన్నివేశాలు తొలగించినందున దయచేసి సినిమా ఆడేందుకు అందరూ సహకరించారని ఈ సందర్భంగా దిల్ రాజు తెలంగాణవాదులకు విజ్ఞప్తి చేశారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. ఇటు ఇండస్ట్రీకి, అటు తెలంగాణవారికి బాధ కలగకుండా ఉండే విధంగా తాను మధ్యవర్తిగా చర్యలు తీసుకున్నానని చెప్పారు. కట్ చేసిన సీన్లతో ఇవ్వాల్టి నుండి తెలంగాణలో ప్రదర్శింపబడుతుందని చెప్పారు.


Click it and Unblock the Notifications











