Nayanthara పెళ్ళైన రెండో రోజే చిక్కుల్లో నయనతార.. భార్యాభర్తల మీద పోలీసు కేసు?
పెళ్లయిన మరుసటి రోజే లేడీ సూపర్స్టార్ నయనతార దంపతులు భక్తి సంబంధింత వివాదంలో చిక్కుకున్నారు. గురువారం నాడు తన ప్రియుడు విఘ్నేష్ శివన్ను పెళ్లాడిన నయనతార.. శుక్రవారం భర్తతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. శ్రీ వారి దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన వారిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. అయితే అక్కడి దాకా బాగానే ఉంది కానీ శ్రీవారి ఆలయ మాడవీధుల్లో చెప్పులతో కలియతిరిగారు. ఇప్పుడు ఈ వ్యవహారం మీద పోలీసు కేసు నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు.

ఫోటో షూట్
శ్రీవారి దర్శనానంతరం బయటకు వచ్చిన నయనతార మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడిచారు. ఆమె భర్త విఘ్నేష్ శివన్తో పాటు ఇతరులందరూ చెప్పుల్లేకుండానే నడిచినా నయనతార మాత్రం చెప్పులు ధరించడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి తోడు శ్రీవారి ప్రధాన మహా ద్వారానికి సమీపంలో నయనతార, విఘ్నేష్ శివన్లు ఫోటో షూట్ చేసుకోవడం కూడా కాంట్రవర్సీకి కారణమైంది.

బహిరంగ క్షమాపణలు చెప్పాలి
ఎందుకంటే భక్తులు పరమ పవిత్రంగా భావించే ఈ ప్రాంతంలో కెమెరాలు వాడకంపై నిషేధం కూడా ఉందని అంటున్నారు. ఈ విషయం మీద ఏపీ బీజేపీ నేత, మాజీ టిటిడి బోర్డ్ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. నయనతార దంపతులు బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాక అసలు తిరుమల పైకి సినిమా పరికరాలు ఎలా అనుమతించారు అని ప్రశ్నించారు.

టీటీడీ స్పందించి
అసలు తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలు వల్ల భక్తుల మనోభావాలను దెబ్బతింటాయని అన్నారు. తిరుమలలో ఈ ఘటనకు కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన, టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ల తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) స్పందించింది.

దురదృష్టకరమే
నయనతార దంపతుల ఫోటో షూట్పై (టీటీడీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. విజిఓ బాలిరెడ్డి స్పందిస్తూ తిరుమల మాడవీధుల్లో నయనతార చెప్పులు ధరించి రావడం దురదృష్టకరమని.. హీరోయిన్ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చు అనే అంశంపై చర్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నయనతార దంపతులు మాడవీధులోకి చెప్పులు ధరించి రావడం దురదృష్టకరమన్న ఆయన తిరుమలకు విచ్చేసిన వారంతా భక్తులే...ఉద్దేశపూర్వకంగా నిబంధనలు అతిక్రమిస్తారని భావించడం లేదని అన్నారు.

పెళ్ళికి ఎలా పిలుస్తారు
నయనతార దంపతులు పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని, అలాగే ఎలాంటి సెక్షన్ క్రింద కేసు నమోదు చేయవచ్చు అన్న అంశం పై న్యాయ శాఖాధికారులతో చర్చిస్తున్నామని అన్నారు. ఇక అలాగే నయనతార పెళ్లికి మలయాళ హీరో దిలీప్ ను పిలవడం మీద కూడా పెద్ద ఎత్తున రచ్చ రేగింది. లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తిని పెళ్ళికి ఎలా పిలుస్తారు అంటూ ఆమె మీద కొందరు ఫైర్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











