ఉదయ్ శంకర్ హీరోగా కొత్త సినిమా.. వీవీ వినాయక్ చేతుల మీదుగా ప్రారంభం!
సినిమా పరిశ్రమ కొత్త టాలెంట్స్కి స్వాగతం పలుకుతోంది కానీ అందులో నిలదొక్కుకోగలిగేది కొందరే. కేవలం పాపులారిటీ కోసమే రంగంలోకి దిగేవాళ్లు ఉంటారు కానీ సినిమా రంగంలోకి రాకముందే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే వాళ్ళు మరికొందరు. అయినప్పటికీ, వారు తమ అభిరుచి కారణంగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతూ ఉంటారు. వర్ధమాన హీరో ఉదయ్ శంకర్ టాలీవుడ్లోకి అడుగు పెట్టకముందే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు దక్కించుకుని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన 'ఆటగదరా శివ' వంటి విలక్షణ చిత్రంతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత మిస్ మ్యాచ్, క్షణ క్షణం(2021)లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. తాజాగా ఉదయ్ శంకర్ హీరోగా, జెన్నిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్ గా శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ లో కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఫస్ట్ క్లాప్ ఇచ్చి సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ రామ్ సర్ కెమెరా స్విచ్ఛాన్ చేసి టీం కి ఆశీస్సులు అందించారు. ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి ఆత్మీయ అతిథిగా విచ్చేసి యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మధునందన్, పృథ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యంగార్ సనా, కళ్యాణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే కథా, కథనాలతో సాగే ఈ మూవీ ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందించబోతుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. 'ఇది మా కథ' వంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు ఆకట్టుకున్న దర్శకుడు గురు పవన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఈ నెల 25 నుండి వైజాగ్ లో ప్రారంభం అవుతుంది. మొదటి షెడ్యూల్ వైజాగ్ లో 20 డేస్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

బుధవారం నాడు హైదరాబాద్ పుప్పాల గూడలోని శివాలయంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. సినిమా కాన్సెప్ట్ ని తెలుసుకొని టీంని దర్శకుడు వి.వి. వినాయక్ అభినందించారు. ఒక అందమైన ప్రేమకథ చుట్టూ జరిగే థ్రిల్లింగ్ అంశాలను చాలా కమర్షియల్ వేలో రూపొందించబోతున్నామని దర్శకుడు గురు పవన్ తెలిపారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి నారాయణరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సిద్ధం మనోహర్ డి.ఓ.పిగా పని చేయనుండగా గిఫ్టన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జునాయిడ్ సిద్ధికి ఎడిటర్ గా పని చేస్తున్న ఈ సినిమాకు దౌలూరి నారాయణ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేయనున్నారు. ఇక అట్లూరి నారాయణరావు నిర్మాతగా వ్యవహరించనున్నారు.


Click it and Unblock the Notifications











