సంజయ్ దత్కి షాక్, ఇక కూతురిని కలవలేడు!
ముంబై : బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్కు షాకింగ్ న్యూస్. అమెరికాలో ఉంటున్న ఆయన కూతురు త్రిషాలను ఆయన ఇకపై వెళ్లి కలవ లేడు. ఎందుకంటే ఇకపై ఆయనకు అలాంటి అవకాశం లేదు. అయితే త్రిషాల ఇండియా వచ్చి సంజయ్ని కలవడానికి వీలుంది. అమెరికా చట్టాల ప్రకారం ఏ కేసులో అయినా దోషిగా తేలితే...అమెరికా ప్రభుత్వం ఇక వారికి వీసా జారీ చేయదు. ఈ లెక్క ప్రకారం సంజయ్ దత్ ఇకపై అమెరికా వెళ్లి ఆయన కూతురిని కలిసే అవకాశం లేదన్నమాట. త్రిషాల సంజయ్ దత్ మొదటి భార్య కూతురు.
1993 ముంబయి పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమాయుధాలు కలిగి ఉన్నందుకు సంజయ్కి సుప్రీం కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. ఇప్పటికే పద్దెనిమిది నెలల జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్న సంజయ్ని కోర్టులో లొంగి పోవాల్సిందిగా కోర్టుఆదేశించింది. దీంతో ఆయన మిగిలిన మూడున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
క్షమాబిక్ష ద్వారా సంజయ్ బయటకు వస్తారని అంతా అనుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు, పలువురు ప్రముఖులు ఆయనకు ఆయనకు క్షమాబిక్ష ప్రసాదించాలని ఆకాంక్షించారు. అదే సమయంలో ఆయనకు క్షమాబిక్ష వద్దని ఆందోళన చేసే వారు కూడా తెరపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో సంజయ్ దత్ స్పందిస్తూ...తాను క్షమాభిక్ష పిటిషన్ను వేయడం లేదని చెప్పారు. సుప్రీం కోర్టులో తాను లొంగిపోతానని చెప్పారు.


Click it and Unblock the Notifications












