వరుణ్ సందేశ్ ఇంట్లో విషాదం.. కరోనాతో హీరో తాతయ్య మృతి
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఎంతో మందిని పొట్టనబెట్టుకుంటున్న కరోనా వైరస్.. వరుణ్ సందేశ్ తాతయ్యను కూడా తీసుకెళ్లింది. ఇండస్ట్రీలో తారలు వరుసగా కరోనా బారిన పడుతూనే ఉన్నారు. కొందరు కరోనా మూలంగా కన్నుమూస్తున్నారు. అందులో తాజాగా వరుణ్ సందేశ్ తాత, ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి
జీడిగుంట రామచంద్రమూర్తి రచయితగా తన ప్రతిభను చాటారు. రేడియో నాటకాలు రాయడం, వాటిల్లో నటించడం వంటివి చేస్తుండే వారు. కథలు, నాటికలు, నవలలు, సినిమాలకు సంభాషణలు, అనువాద వ్యాసాల రచన ఇలా అన్నింట్లో తన కలానికున్న సత్తా చాటి బహుముఖ ప్రజ్ఞాశాలి అని నిరూపించుకున్నారు.

ఆకాశవాణిలో ..
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని ఆకాశవాణిలో అడుగుపెట్టి పదవీ విరమణ వరకు అందులోనే ఉండిపోయారు. ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన అమెరికా అబ్బాయి సినిమాకు కథ రాశారు.

‘మనోయజ్ఞం' సీరియల్కు
తర్వాత ఈ ప్రశ్నకు బదులేది, పెళ్లిళ్లోయ్ పెళ్లిళ్లు అనే సినిమాలకు మాటలు రాశారు. మరో మాయాబజార్, అమృత కలశం చిత్రాలకు సహ రచయితగా వ్యవహరించారు. టెలివిజన్ లో బాగా ప్రేక్షకాదరణ పొందిన ‘మనోయజ్ఞం' సీరియల్కు 40 ఎపిసోడ్లకు పైగా స్క్రిప్ట్ రాశారు. అలాంటి రామచంద్రమూర్తి మరణం పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢా సానుభూతిని వ్యక్తంచేస్తున్నారు.

కరోనా విజృంభణ..
టాలీవుడ్లో ప్రస్తుతం కరోనా విజృంభిస్తోంది. ఇటీవలె రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడింది. నిన్ననే రాజశేఖర్ కరోనా నుంచి కోలుకున్నారు. నిన్ననే చిరంజీవి కరోనా బారిన పడ్డాడు. మళ్లీ కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది.


Click it and Unblock the Notifications











