ముదిరిన 'వాల్మీకి' వివాదం.. రాజకీయ నాయకులు ఎంటర్ కావడంతో!
Recommended Video
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్న వాల్మీకి సినిమాపై గతంలో రాజుకున్న వివాదం బాగా ముదురుతోంది. తీరా విడుదల తేదీ దగ్గరపడిన ఈ సమయంలో రాజకీయ నాయకులు ఎంటర్ కావడంతో విషయం సీరియస్ అవుతోంది. వాల్మీకి టైటిల్ మార్చేయాలంటూ తాజాగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్య రంగం లోకి దిగటంతో ఈ విషయం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

గతంలోనే వివాదం.. షూటింగ్ నిలిపివేత
వాల్మీకి అనేది తమ కులానికి చెందిన వ్యక్తి పేరని, దాన్ని ఉపయోగించుకోవడమే గాక తుపాకీ వంటి ఆయుధాన్ని పట్టుకొని స్టిల్స్ ఇస్తుండటం సరికాదని వారు గతంలోనే బోయ కులస్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారు షూటింగ్ జరగనీయకుండా అడ్డుకున్నారు కూడా. కానీ ఎలాగోలా షూటింగ్ ఫినిష్ చేసి విడుదలకు రెడీ అయింది చిత్రయూనిట్.

ముదిరిన వివాదం.. రాజకీయ నాయకులు ఎంటర్
మరో వారం రోజుల్లో విడుదల కాబోతున్న 'వాల్మీకి' వివాదం మరింత ముదిరింది. ఈ విషయంలో రాజకీయ నాయకులు ఎంటర్ కావడంతో ఒక్కసారిగా చర్చల్లో నిలిచింది. ఈ సినిమా టైటిల్ మార్చాల్సిందే అని డిమాండ్ చేస్తూ అనంతపురం ఎంపీ తలారి రంగయ్య రంగంలోకి దిగారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ను ఆయన కలవడం జరిగింది.

ఎలా పడితే అలా వాడేది కాదు..
వాల్మీకి పేరును ఎలా పడితే అలా వాడకూడదని తెలుపుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ను వినతి పత్రం అందజేశాడు ఎంపీ తలారి రంగయ్య. దీంతో ఈ విషయంపై కేంద్ర మంత్రి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ విషయం చాలా సున్నితమైందని, వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

వాల్మీకి మూవీ
తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్ గా రాబోతోంది వాల్మీకి మూవీ. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











