తారల జీవితాల్లో చికటికోణాలు ‘వెండితెర విషాద రాగాలు'
హైదరాబాద్: సినిమాల్లో స్టార్స్గా వెలుగొందిన సావిత్రి, మీనాకుమారి, కాంచనమాల, ఫటాఫట్ జయలక్ష్మి, సిల్క్ స్మిత, లీలారాణి, దివ్యభారతి వంటి వారి జీవితాల్లోని చీకటి కోణాల గురించి వారు అర్థంతరంగా మరణించడానికి గల కారణాలను గురించి సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పసుపులేటి రామారావు సంకలనం చేసిన 'వెండితెర విషాద రాగాలు' పుస్తకావిష్కరణ సోమవారం ఫిలిం ఛాంబర్లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి నారాయణరావు తొలి కాపీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాుతూ... ఒకప్పుడు అగ్రతారలుగా వెలుగు వెలిగి చిన్నపాటి కారణాలు, పొరపాట్లతో జీవితాన్ని విషాదభరితం చేసుకున్న వారి గురించి నేటితరం నటీనటులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఒకప్పుడు సినిమాలో వేషం వస్తే దాన్ని నిలుపుకోడానికి అప్పటి తారలు చాలా కష్టపడేవారు. ప్రస్తుత నటీనటులు రెండు సినిమాలు చేస్తేనే పెద్ద ఫొజిషన్ కి వెళ్లినట్టు భావిస్తున్నారు. అది వాపు మాత్రమే. అలనాటి తారల గురించి నేటివారు తెలుసుకోవాలని దాసరి ఈతరం నటీమణులకు సూచించారు.
మహానటి సావిత్రి కోమాలోకి వెళ్లినది మొదలు దమన సంస్కారాలు పూర్తయ్యేదాకా అన్నీ తెలిసిన వ్యక్తిని నేను. చివరి రోజుల్లో కష్టాలు పడినా గొప్ప జీవితాన్ని గడిపిందామె. ఇతరులకు సేవ చేయడం కోసం, ఆత్మాభిమానం కోసం లక్షలు ఖర్చు చేసింది. ఒకే వీధిలో నాలుగు ఇళ్లు వున్న పద్మనాభం తన చివరి రోజుల్లో కారు షెడ్ లో జీవితాన్ని చాలించారు. రాజబాబు, కాంతారావు, హరనాథ్ ఇలా చాలామంది వున్నారు. నేను, నా పిల్లలు అనుకున్న వారంతా కోట్లకు అధిపతులయ్యారు. విశాల హృదయంతో ఆలోచించి సేవలు చేసినవారంతా కష్టాలపాలయ్యారు. వీళ్లందరినీ రామారావు చాలా దగ్గరగా చూశాడు. వారి గురించి అన్ని విషయాలు తెలుసతనికి. 'వెండితెర విషాద రాగాలు' అని మంచి పేరు పెట్టిన ఈ పుస్తకంలో అలనాటి నటీమణుల్ని గురించి బాగా ప్రస్తావించివుంటారని నమ్ముతున్నాను' అని అన్నారు.


Click it and Unblock the Notifications











