Chiranjeevi రాజకీయాలకు గుడ్బై చెప్పి మంచి పనిచేశారు.. పాలిటిక్స్ అంటే ఆసక్తి తగ్గింది.. ఉపరాష్ట్రపతి వెంకయ్య
ప్రస్తుత రాజకీయాలపై ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా ఓ అత్యాధునిక రోగ నిర్ధారణ పరిశోధన శాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, మాజీ కెప్టెన్ అజారుద్దీన్, మంత్రి శ్రీనివాసయాదవ్, పుల్లెల గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, వెంకయ్యనాయుడు మాట్లాడుకొన్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

దేశానికి రాష్ట్రపతి కావాలి అంటూ
చిరంజీవి మాట్లాడుతూ.. పునీత్ రాజ్కుమార్ మరణం గురించి వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు. అలాంటి మరణాలకు కారణం అవుతున్న విషయాలను ముందే తెలుసుకొంటే.. ఎన్నో చేదు సంఘటనలు నిలువరించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే తన ప్రసంగం చివర్లో మాట్లాడుతూ.. తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్. ఆ తర్వాత తెలుగుదనానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి శ్రీ వెంకయ్యనాయుడు.
ఆయన అందరూ గర్వించే విధంగా ఉపరాష్ట్రపతి అయ్యారు. ఇంకా అందరి కోరికను తాను కోరుకొంటూ.. ఆయన దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి హోదాను చేపట్టే అవకాశం లభిస్తే.. దానిని వదులుకోకుండా చేపట్టాలని కోరుకొంటున్నాను అని చిరంజీవి అన్నారు.

చిరంజీవి గొప్పతనం అంటూ వెంకయ్య
అనంతరం శ్రీ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. దేశానికి ప్రథమ పౌరుడు కావాలని మెగాస్టార్ చిరంజీవి కోరుకోవడం ఆయన అభిమానం. అందరూ అనుకొనే మాటనే ఆయన చెప్పారు. కానీ మరో ఐదేళ్లు ప్రజలకు దూరంగా ఉండాలనే విషయం చాలా భయంగా ఉంది.
అలాగని నాకు రాష్ట్రపతి పదవి ఇస్తారని విషయాన్ని పక్కన పెడితే.. నా ఆలోచన ఏమిటంటే.. వీలైనంత వరకు ప్రజల మధ్య ఉండాలని కోరుకొంటాను అంటూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నాకు ఎప్పుడూ ఊర్లు తిరగడం, ప్రజలను కలుసుకోవడం అలవాటు అని చెప్పారు.

ప్రోటోకాల్స్ వల్ల అలాంటి ఇబ్బందులు
గతంలో ప్రతీ ఊరు తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ భోజనాన్ని ఆస్వాదించడం చేసేవాడిని. కానీ బాధ్యతాయుతమైన పదవిని చేపట్టి తర్వాత అనేకమైన ప్రోటోకాల్స్ ఉంటాయి. వాటి వల్ల కొన్ని మనసుకు నచ్చిన పనులు చేయలేకపోతున్నానని వెంకయ్య నాయుడు తెలిపారు. గతంలో వెళ్తూ వెళ్తూ కావాలిలో చిట్టెమ్మ దోశ తినేవాడిని. విజయవాడకు వెళితే పునుగులు తినాలి అనిపిస్తుంది. మరో చోటికి వెళితే పండ్లు ఫలాలు తినేవాడిని. ప్రోటోకాల్ వల్ల అవి సాధ్యం కావడం లేదు అని తన మధురానుభూతులను పంచుకొన్నారు.

రాజకీయాల్లో పరిమళం లేదు అంటూ
ప్రస్తుత రాజకీయాల్లో పరిమళం లేదు. అందుకే నాకు రాజకీయాలంటే ఆసక్తి తగ్గిపోయింది. గతంలో ఉన్న మాదిరిగా రాజకీయాలు ఆరోగ్యవంతంగా లేవు. నేను ఎక్కువగా మాట్లాడి రాజకీయ నేతలను కించపరచడం, అవమానించ దలచుకోను. చిరంజీవి రాజకీయాల్లో నుంచి తప్పుకొని మంచి పని చేశారు. బ్రహ్మండంగా కళామతల్లికి సేవ చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం కూడా బాగుంటుంది. చూడటానికి ఆయన బాగా ఉన్నారు అని వెంకయ్య నాయుడు అంటే.. అవును నా ఆరోగ్యం బాగుంది అంటూ పక్కనే ఉన్న చిరంజీవి సమాధానం ఇచ్చారు.

చిరంజీవి పరిశ్రమకు మూడో కన్ను
చిరంజీవి సినీ పరిశ్రమకు మూడో కన్ను అని ఎప్పుడో చెప్పాను. తెలుగు సినీ కళామతల్లికి ఒక కన్ను ఎన్టీఆర్, మరో కన్ను ఏఎన్నాఆర్. వారి తర్వాత మూడో కన్ను చిరంజీవి. పది కాలలు గుర్తుపెట్టుకొనే విధంగా చిరంజీవి ఎదిగారు. ఇంకా సినీ పరిశ్రమలో చురుకుగా నటిస్తున్నారు అని వెంకయ్య నాయుడు అన్నారు.

రాజకీయ నేతలు జాగ్రత్తగా ఉండాలి
రాజకీయ పార్టీలో నేతగా ఉండటం తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు వేసుకోవడం లాంటిది. నేతలపై చిన్న మరక పడితే అందరూ గమనిస్తారు. కాబట్టి అందరూ ప్రజా జీవితంలో జాగ్రత్తగా ఉండాలని సీనియర్ నేత అద్వానీ గారు ఎప్పుడూ చెబుతారు. ముఖ్యంగా బీజేపీ నేతలు మరీ జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం రాజకీయ నేతలు వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న భాష చాలా అభ్యంతరకరంగా ఉంది. వాళ్ల భాష వింటూ ఉంటే.. చాలా బాధగా ఉంది. అలాంటి నేతలను, భాషను సంస్కరించాలి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
Recommended Video

కళ్లు కావాలంటవి.. కడుపు వద్దంటది..
ఇక ప్రధానంగా ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ఆరోగ్యమనే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం బాగా ఉంటే అంతకంటే సంపన్నుడు ఎవరు ఉండరు. ఆరోగ్యం బాగుంటేనే పుల్లారెడ్డి స్వీట్లు తినొచ్చు. దమ్ బిర్యానీ తినడానికి ఛాన్స్ ఉంది. ఆరోగ్యం లేకపోతే వాటిని చూస్తూ బతకాల్సి ఉంటుంది. కళ్లు కావాలంటాయి... కడుపు వద్దంటుంది అని పెద్దలు చెబుతుంటారు. ఆరోగ్యాన్ని కాపాడే విధంగా శాస్త్రీయ, సాంకేతిక పద్దతులతో ఇలాంటి వైద్యశాల ఏర్పాటు కావడం సంతోషంగా ఉంది అని వెంకయ్యనాయుడు తెలిపారు.


Click it and Unblock the Notifications











