#ANRLivesOn తెలుగు భాషను కొందరు పాలకులు నిర్లక్ష్యం.. ఆ భయం వెంటాడుతున్నది.. వెంకయ్యనాయుడు
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు సెప్టెంబర్ 20వ తేదీ. సెప్టెంబర్ 20 తేదీన ఆయన జన్మదినాన్ని ఘనంగా సినీ ప్రముఖులు, అభిమానుల జరుపుకొంటారు. అయితే ఈ ఏడాది ఆయన 100 పడిలోకి ప్రవేశించారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకున్నా అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు అక్కినేని నాగేశ్వరరావు 100వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకొంటున్నారు.
శత జయంతి ఉత్సవాల సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మోహన్ బాబు, అనుపమ్ ఖేర్, మురళీ మోహన్ రావు, నాని, మహేష్ బాబు, నమ్రత తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..

అక్కినేని కుటుంబ సభ్యులు చొరవ తీసుకొని నాగేశ్వరరావు సజీవ విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. అక్కినేని వెంకట్, నాగార్జున, నాగ సుశీల ఆహ్వానించడంతో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహా విష్కరణకు రావడం జరిగింది. ఈ వేడుకలో నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, అభిమానులు హజరయ్యారు. వారందరికీ నా ధన్యవాదాలు అని వెంకయ్యనాయుడు తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
శ్రీ నాగేశ్వరరావు సజీవ శిల్పాన్ని చెక్కిన శిల్పులను అభినందిస్తున్నాను. జీవకళ ఉట్టిపడేలా చెక్కిన వారిని ఆశీర్వదిస్తున్నాను. నాగేశ్వరరావు నిజంగా ఉన్నారా? అనేట్టు విగ్రహన్ని నెలకొల్పారు. అక్కినేని నాగేశ్వరరావు నటుడు కాదు.. మహా నటుడు. మహ మనిషి. మనుసుల్లో మనుషుల్లో మహమనిషి. నటుల్లో మహా నటుడు. వారితో వ్యక్తిగతంగా మంచి పరిచయం ఉంది. అనేక విషయాల గురించి మాట్లాడి చర్చించుకొనే వాళ్లం. నాగేశ్వరరావు జీవితాంతం నటిస్తూనే ఉన్నారు. చివరి శ్వాస వరకు నటించిన ఏకైక నటుడు నాగేశ్వరరావు అని వెంకయ్య నాయుడు అన్నారు.

సినిమా రంగంలో విలువలు పాటించిన అతి కొద్ది మంది నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. విలువలు వదిలేసిన నాయకులు ఉన్న రోజుల్లో మంచి సంప్రదాయాలు, ప్రమాణాలకు రూపకల్పన చేసిన వ్యక్తి నాగేశ్వరరావు. ఆయన చూపిన మార్గంలో ప్రయాణించడమే నాగేశ్వరరావుకు ఇచ్చే ఘనమైన నివాళి. ఆయన మాట, బాట, కట్టుబాట్లు, నడవడిక, కట్టు, బొట్టు పాటించడమే గొప్ప నివాళి అని వెంకయ్య నాయుడు అన్నారు.
అక్కినేని నాగేశ్వరరావు చక్కటి తెలుగు మాట్లాడేవారు. అదే సంప్రదాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడటం చాలా సంతోషం. ఎందుకంటే తెలుగు భాష కనుమరుగు అవుతున్నదనే భయం వెంటాడుతున్నది. పాలకులు తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తెలుగు భాషకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని స్పూర్తిగా తీసుకోవాలి. భాష పోతే శ్వాస ఆగిపోతుంది. భాష కనుమరుగైతే సినిమా ఉండదు. పత్రికలు, ఛానెల్స్ ఉండవు అని వెంకయ్యనాయుడు అన్నారు.

అమ్మ ఒడి, గుడి, బడి నుంచి వచ్చిన తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది. తెలుగు భాషను ప్రొత్సహించడానికి చేయాల్సింది ఏమీ లేదు. అందరం తెలుగులో మాట్లాడితే చాలూ అని వెంకయ్య నాయుడు సూచించారు. ఏ రంగంలో ఉన్నా.. కొన్ని విలువలు పాటించాలి. విలువలు పాటించడం కష్టమైనది కాదు. ఇష్టమైన పని చేసేటప్పుడు విలువలు పాటించడం కష్టమైనది కాదు. కేవలం భాష మాత్రమే కాదు.. పిల్లలకు విలువలు నేర్పించిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు అని వెంకయ్య నాయుడు అన్నారు.


Click it and Unblock the Notifications











