ఐదోసారి వెంకటేష్ ఆమెతో కలిసి...
హైదరాబాద్ : వెంకటేష్ మీనా కలసి నాలుగు సినిమాల్లో నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన 'చంటి', 'అబ్బాయిగారు', 'సుందరకాండ', 'సూర్యవంశం' ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే.వెంకటేష్, మీనా మరోసారి జోడీ కట్టబోతున్నారని సమాచారం. శ్రీప్రియ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ఈ జోడీ ప్రేక్షకుల్ని అలరించబోతోంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'దృశ్యమ్'కి రీమేక్గా ఈ సినిమా రూపొందుతుంది.
మాతృకలోనూ మోహన్లాల్ సరసన నటిచింది మీనానే. అందులో మీనా నటనని చూసిన దర్శక,నిర్మాతలు ఈ సినిమాకి కూడా ఆమెనే హీరోయిన్ గా ఎంచుకోవాలని నిర్ణయించారని సమాచారం. అలాగే నదియా ఈ చిత్రంలో కీలకమైన పాత్ర అయిన పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తారు.
పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైన మీనా.. ఆ మధ్య 'తంబిక్కోట్త్టె'లో మళ్లీ కనిపించింది. అంతేకాకుండా బుల్లితెరపై కొన్ని కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా కూడా వస్తోంది. అలాగే కేరళలో క్రిస్మస్ కానుకగా విడుదలైన 'దృశ్యం' చిత్రం విజయం సాధించంతో ఆమె కెరీర్ లో కొత్త అధ్యాయం మొదలైనట్లైంది. ఇందులో మోహన్లాల్కు భార్యగా ఆమె నటించింది. ఆమె నటనలో మరో కోణాన్నిఆవిష్కరించింది.
మీనా మాట్లాడుతూ.. ''కుటుంబ కథా చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులకూ నచ్చింది. మళ్లీ మలయాళ ప్రేక్షకులను ఈ చిత్రంలో పలకరించడం ఆనందంగా ఉంది''అని చెప్పింది. ఈ చిత్రం మోహన్ లాల్ కి పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమాగా చెప్తున్నారు. అలాగే మీనా..చిత్రంలో ఇద్దరి బిడ్డల తల్లిగా చేసింది. ఆమెకు కూడా టర్నింగ్ పాయింట్ అంటున్నారు. ఇక, ఆ మధ్య విడుదలైన 'శ్రీ జగద్గురు ఆదిశంకర'లో ఆమె ఓ పాత్ర చేసిన విషయం తెలిసిందే. విద్యాసాగర్ని పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు తల్లయిన తర్వాత మీనా రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు.
మరో ప్రక్క మీనా డబ్బింగ్ ఆర్టిస్టుగా కొత్త అవతారమెత్తి తన పయనాన్ని సాగిస్తున్నారు. బాలనటిగా కెరీర్ను ప్రారంభించిన మీనా అప్పట్లో తెలుగు, తమిళంలో నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగారు. రజనీకాంత్, కమల్హాసన్, సత్యరాజ్, ప్రభు, అజిత్ వంటి అగ్రహీరోలతో ఆడిపాడి ప్రేక్షకులను విశేషంగా అలరించారు. వివాహానంతరం మీనా వెండితెరకు దూరమయ్యారు. ఇప్పుడు వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు కాబట్టి కెరీర్ని సీరియస్గా తీసుకుంటున్నారని ఊహించవచ్చు.


Click it and Unblock the Notifications












