ప్రముఖ నటి జయంతి పరిస్థితి విషమం.. వెంటిలెటర్పై చికిత్స
దక్షిణాదిలో ప్రముఖ నటి జయంతి తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆమెను హాస్పిటల్లో చేర్చారు. గత కొద్దికాలంగా అస్తమా, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెకు కరోనావైరస్ పరీక్షలు నిర్వహించగా.. పరీక్షల్లో నెగిటివ్గా తేలింది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించడంతో ఆమెను బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్లో చేర్పించారు.
జయంతి ఆరోగ్యంపై సమాచారాన్ని ఆమె కుమారుడు కృష్ణ కుమార్ మీడియాకు వెల్లడించారు. గత 35 ఏళ్లుగా అస్తమాతో బాధపడుతున్నారు. 2018లో కూడా ఇదే కారణంతో ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లో చేరారు. మళ్లీ శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో హస్పిటల్లో చేర్పించాం. వెంటిలెటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్యం నిలకడగా ఉంది అని చెప్పారు.

లాక్డౌన్ సమయంలో జయంతి వార్తల్లో నిలిచారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేసిన సందర్బంలో ఆమె హంపీలో చిక్కుకుపోయారు. కొన్ని రోజులు అక్కడే హోటల్లో గడిపిన ఆమె లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో బెంగళూరు చేరుకొన్నారు.
ఇక జయంతి కెరీర్ విషయానికి వస్తే.. ఆమె ఇప్పటి వరకు 500 చిత్రాల్లో నటించారు. దాదాపు 300 చిత్రాల్లో హీరోయిన్గా నటించడం విశేషం. తెలుగులో 1951లో భార్య భర్తలు సినిమాతో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరీ, దొంగ మొగుడు, కొదమ సింహం, పెదరాయుడు, సైరా నర్సింహారెడ్డి చిత్రాల్లో నటించారు.
తన కెరీర్ మొత్తంలో నాలుగు సార్లు ఉత్తమ నటిగా కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డులు, రెండు ఫిలింఫేర్ అవార్డులు, ఒకటి రాష్ట్రపతి పతకం పొందారు.


Click it and Unblock the Notifications











