ఎస్పీ బాలుకి వేటూరి పురస్కారం
హైదరాబాద్ : సంగీత సాహిత్య రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు సేఫ్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేటూరి పేరున పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎ.భరద్వాజ్, ప్రభాకర్ తెలిపారు. 2013వ సంవత్సరానికిగానూ ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి వేటూరి జీవితకాల సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నట్టు తెలిపారు.
రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావును స్మారక పురస్కారానికి, సంగీతరంగంలో సేవలందిస్తున్న కె.రామాచారిని ప్రశంసా పురస్కారానికీ ఎంపిక చేశామని ప్రకటించారు. ఈ నెల 28న హైదరాబాద్లోని సత్యసాయి నిగమాగమంలో ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ చేతులమీదుగా ప్రదానం చేయనున్నట్టు తెలిపారు.

ఈ వేడుకకి అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయబాబు, రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, పరుచూరి గోపాలకృష్ణ, తనికెళ్ల భరణి, సుద్దాల అశోక్తేజ, చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, కోన వెంకట్, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరవుతున్నట్టు తెలిపారు. సేఫ్ హెల్త్ ఫౌండేషన్, ఈటీవీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుక జరగబోతోంది.


Click it and Unblock the Notifications











