Telangana కేసీఆర్ ఓటమి కారణం అదే.. పదవికి దూరంగా ఉంటే.. విజయశాంతి సంచలన కామెంట్స్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సాధించిన గెలుపుపై ఆమె సోషల్ మీడియాలో ట్వీట్లతో హడావిడి చేస్తున్నారు. అయితే కేసీఆర్ తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తిని తన పోస్టులో పేర్కొన్నారు. విజయశాంతి చేసిన ట్వీట్ల వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సొంతంగా పార్టీ పెట్టి విజయశాంతి ఉద్యమాన్ని నడిపించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి పార్లమెంట్లో తన వాదనను బలంగా వినిపించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొంత కాలం టీఆర్ఎస్లో ఉన్నారు. అనంతరం బీజేపీలో చేరారు. అయితే తాజా ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్లోకి చేరారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించిన తర్వాత గాంధీభవన్లో ప్రత్యక్షమయ్యారు. ఆమెను పీసీసీ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీపై పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు. కాలం కొన్ని పరిణామాలను ఎప్పుడూ నిర్దేశిస్తది. కోట్లాది మంది తెలంగాణ బిడ్డలు జీవితాలు మంచిగా ఉండాలని మనస్పూర్తిగా నిరంతరం కోరుకొనే ఒక ఉద్యమకారిణిగా సేవలు అందించాను అని విజయశాంతి చెప్పారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం ఇద్దరే ఎంపీలుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ కోసం కొట్లాడినం. అప్పటి నుంచి మా మధ్య విధానపరంగా అనేక వ్యతిరేకతలు ఉన్నా, నేను అన్నా అని పిలిచి, గౌరవంతో కలిసి పనిచేశాను. కేసీఆర్ గారు తానే స్వయంగా ఎమ్మెల్యేగా కూడా ఓటమి పొందిన స్థితికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనిపించడం బాధాకరం అని విజయశాంతి అన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, కాదంటే 2018 ఎన్నికల తర్వాత కావచ్చు.. మొదట కేసిఆర్ గారు ఎన్నో పర్యాయాలు చెప్పినట్లుగా, పదవికి దూరంగా ఉంటే ఈ పరిణామాలు వారికి తెలుస్తాయి అని అన్నారు. ఏదిఏమైనా ఏర్పడనున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల గౌరవంతోకూడిన ప్రతిపక్ష హుందాతనాన్ని కేసీఆర్ గారు, బీఆర్ఎస్ నుంచి ఎలా ఉంటుందనే విషయం గురించి తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్నది అని విజయశాంతి చెప్పారు.


Click it and Unblock the Notifications











