కోహ్లీ తేల్చేసాడు: అనుష్కను ప్రేమిస్తున్నా
ముంబయి: కొన్ని విషయాలు ఎంత దాచాలనుకున్నా దాగవు. అందులో సెలబ్రెటీల విషయంలో మరీను. వారిపై మీడియా, అభిమానులు ఎప్పుడూ వేయి కళ్లు వేసి...వారు ఏం చేస్తున్నారో గమనిస్తూంటారు. ఇవన్నీ గుర్తించాడో ఏమో.. అనుష్క శర్మతో తన అనుబంధాన్ని విరాట్ కోహ్లి ధ్రువీకరించాడు. తాము ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. తమ విషయంలో జనం ఇంగితంతో ఆలోచించాలని అన్నాడు. తమ వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరాడు.
''ఇప్పుడంతా బహిర్గతమైపోయింది. మేమేమీ దాచట్లేదు. దాచడానికీ ప్రయత్నించట్లేదు. కానీ జనం ఒకే విషయం గురించి మళ్లీ మళ్లీ అడగడం, దాన్ని చర్చనీయాంశం చేయడం సరి కాదు'' అని కోహ్లి చెప్పాడు. తనకు, అనుష్కకు మధ్య ఉన్న సంబంధం గురించి ఇప్పటికే తెలిసిపోయినందున తమ గురించి జనం కుతూహలం చూపించాల్సిన అవసరం లేదన్నాడు.
''మేము ఎక్కడైనా కనపడితే.. 'మీ మధ్య బంధం నిజమేనా' అని ఇప్పటికీ అడుగుతున్నారు. కాస్త ఇంగిత జ్ఞానం వాడితే మంచిది. విషయం తెలిసినప్పుడు మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడగడం ఎందుకు? మా బంధం గురించి మాట్లాడడం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది మా వ్యక్తిగతమైంది. దాన్ని మీడియాతో పాటు అందరూ గౌరవించాలి'' అని కోహ్లి చెప్పాడు.

మరో ప్రక్క నిన్న పొద్దుపొద్దునే ట్విట్టర్లో అంతుచిక్కని వ్యాఖ్యలతో విరాట్ కోహ్లి అభిమానుల్లో పెద్ద కలకలమే రేపాడు. నేనేం తప్పు చేశానో త్వరలోనే చెప్పబోతున్నా! లేదు లేదు.. నేనెలాంటి తప్పూ చేయలేదు..! కాదు నేను తప్పు చేశా! అంటూ కొన్ని ట్వీట్లు చేశాడు. మైదానంలో మాట్లాడేటప్పుడు కానీ, బౌలర్లను బాదేటప్పుడు కానీ ఏమాత్రం తటపటాయించని కోహ్లి.. తన ట్వీట్లతో జనాలను మాత్రం అయోమయంలో పడేశాడు.
దీంతో రకరకాల వూహాగానాలు చెలరేగాయి. ఆస్ట్రేలియా పర్యటనకు అనుష్కను తీసుకెళ్లాలా లేదా అన్న విషయంపై కోహ్లి సందిగ్థంలో ఉన్నాడని.. ఆ నేపథ్యంలోనే ట్వీట్లు చేశాడని కొందరు.. కాదు కాదు.. ముద్గల్ నివేదికపై ఏదో విషయం చెబుతాడని మరికొందరు.. ఇలా ఆన్లైన్లో పెద్దస్థాయిలోనే చర్చ జరిగింది. చివరికి అందరి వూహాగానాలకు తెరదించాడు. తన పేరు మీద విడుదలవుతున్న దుస్తుల ప్రచార వ్యూహంలో భాగంగానే చేశానని కోహ్లి సెలవిచ్చాడు.
కొద్ది రోజుల క్రితం జరిగిన విషయం గుర్తు చేసుకుంటే...
ఉప్పల్లో భారత్, శ్రీలంక మూడో వన్డేకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మరో విశిష్ట అతిథి వచ్చారు. అది మరెవరో కాదు.. విరాట్ కోహ్లి ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ. కొన్నాళ్లుగా కోహ్లితో కలిసి అందరికీ తెలిసేలా చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్న అనుష్క.. ఆదివారం మ్యాచ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాండ్స్లో కూర్చుని శ్రద్ధగా మ్యాచ్ చూసిన అనుష్క.. కోహ్లి షాట్లు ఆడినపుడల్లా కేరింతలు కొట్టింది.
చతురంగ డిసిల్వా బౌలింగ్లో కోహ్లి సిక్సర్ బాది అర్ధసెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత వేగంగా 6 వేల మైలురాయి దాటిన ఆటగాడిగా రికార్డు అందుకున్న సమయంలో అనుష్క లేచి నిలబడి చప్పట్లతో అతణ్ని అభినందించింది. ఆ సమయంలో విరాట్ కూడా అనుష్కను మరిచిపోలేదు. అనుష్క వైపు బ్యాటు చూపిస్తూ.. ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు.
ఇక దాపరికాలేమీ లేవు.. ప్రేమికులిద్దరూ బయటపడిపోయారు.. కలిసి స్టేడియానికి వచ్చేశారు! మ్యాచ్కు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కలిసి హాజరయ్యారు. కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీళ్లిద్దరూ.. చాటుమాటుగా కలుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనకు అనుష్క వెంట తీసుకెళ్లేందుకు బీసీసీఐ నుంచి ప్రత్యేక అనుమతి కూడా సంపాదించాడు కోహ్లి.
ఆ పర్యటనలో విరాట్ విఫలమవడానికి అనుష్కే కారణమన్న విమర్శలు కూడా వినిపించాయి. ఆ సంగతలా ఉంటే ఈ మధ్యే ముంబయిలోని ఓ హాస్పిటల్లో మీడియా కెమెరాలకు చిక్కిన విరాట్, అనుష్క.. ఆదివారం ఏకంగా స్టేడియానికే కలిసొచ్చారు. ఈ ప్రేమ జంట అందరికీ తెలిసేలా కనిపించడమిదే తొలిసారి. విరాట్ తాను సహ యజమానిగా ఉన్న గోవా ఎఫ్సీ టీషర్టు ధరించి మ్యాచ్కు రాగా.. అనుష్క కూడా అదే జెర్సీ వేసుకుంది.
పుణెతో జరిగిన ఈ మ్యాచ్లో తన జట్టు ఓడిపోతుండటంతో కోహ్లి కాస్త కంగారుగా కనిపించాడు. అనుష్క మాత్రం సరదాగా గడిపింది. ఇటీవలే కోహ్లి, అనుష్క కుటుంబాలు ముంబయిలో కలుసుకున్న నేపథ్యంలో వీళ్లిద్దరూ పెళ్లి పీటలెక్కవచ్చని.. ఆ నేపథ్యంలో బహిరంగంగా ఇలా కలుసుకున్నారని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











