ఆ అక్రమసొమ్ము ని పిల్లలకోసం వాడండి : హీరో విశాల్
తమిళనాడు ఎన్నికల్లోకీలకమైన పోలింగ్ కు సమయం దగ్గరకు వచ్చిన సమయంలో మూడు కంటైనర్లలో రూ.570 కోట్ల నగదును పోలీసులు గుర్తించటం తెలిసిందే. తనిఖీల్లో భాగంగా ఈ భారీ మొత్తాన్ని పోలీసులు గుర్తించటం ఆసక్తికరంగా మారింది. తమిళనాట సినీరంగానికి, రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది.
అందుకే రాజకీయంగా జరిగే ప్రతీ పరిణామం పై సినీతారలు తమ అభిప్రాయాలను చెపుతుంటారు. తాజాగా నడిగర్ సంఘం వివాదంతో పూర్తి స్థాయి రాజకీయ వేత్తగా మారిన యంగ్ హీరో విశాల్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. సామాజిక కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొనే యువ హీరో విశాల్ రూ.570 కోట్ల ఉదంతంపై సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు.
కనివినీ ఎరుగని రీతిలో ఒకేసారి మూడు కంటైనర్ లలో 570 కోట్ల డబ్బు దొరకటం సామాన్య ప్రజానీకంతో పాటు సెలబ్రిటీలకు కూడా షాక్ ఇచ్చింది. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా దొరికిన ఆ భారీ నగదును చిన్న పిల్లల చదువు, మధ్యాహ్న భోజన పథకాలకు వినియోగించాలంటూ సలహా ఇచ్చాడు విశాల్.
తిరుప్పూర్లో 3 కంటైనర్లలో భారీగా డబ్బును తీసుకు వెళుతుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న డబ్బు రూ. 570 కోట్లుగా ఎన్నికల అధికారులు గుర్తించారు. కోయంబత్తూర్ దగ్గర మరో రూ.195 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ డబ్బు ఎవరిదనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
ఇన్ని వందల కోట్ల నగదు ఎవరికి సంబంధించిందన్న విషయం మీద పలు అభిప్రాయాలు వ్యక్తమువుతున్నాయి. ఇది ఎవరి సొమ్ము కాదని.. బ్యాంక్ సొమ్ము అన్న మాట ఓపక్క వినిపిస్తోంది. అయితే.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా అంత పెద్ద మొత్తాన్ని బ్యాంకులు తరలిస్తాయా? అన్న సందేహాలు మరోవైపు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం మీద ఓ పక్క హాట్ చర్చ జరుగుతుంటే.. మరోవైపు సెలబ్రిటీలు సైతం రియాక్ట్ కావటం గమనార్హం.


Click it and Unblock the Notifications











