తాగిన మైకంలో అంజలితో బాలయ్య.. అసలు జరిగిందేమిటో తెలుసా? ట్రోలింగ్పై విశ్వక్సేన్ ఆగ్రహం
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. తనతో సెల్ఫీలు దిగేందుకు , షేక్హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చే వారిపై చేయి చేసుకోవడం విమర్శల పాలు చేసింది. దీంతో బాలయ్య వద్దకు వెళ్లాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా భయపడే పరిస్ధితులు నెలకొన్నాయి. సొంత అభిమానులే ఈ విషయంపై బాలకృష్ణను తప్పుబడుతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా బాలయ్య మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. తాజాగా నటసింహం మరో వివాదంలో చిక్కుకున్నారు.
ఇటీవల యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ''గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి '' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్లో వేదికపైకి వచ్చిన తర్వాత సినీనటి అంజలిని బాలయ్య నెట్టివేయడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. బాలయ్య తీరుపై నెటిజన్లు, పలువురు ప్రముఖులు మండిపడుతున్నారు. చిత్ర యూనిట్ అసలు ఏం జరిగిందో చెప్పినా వివాదానికి తెరపడటం లేదు.

యూనిట్తో కలిసి బాలయ్య ఫోటోలకు పోజులు ఇచ్చే క్రమంలో అంజలిని పక్కకు జరగమన్నారు. అయితే ఆమె సరిగా వినిపించుకోలేదు, దీంతో బాలయ్యను ఆమెను పక్కకు నెట్టారు.. తొలుత అంజలి షాక్ అయినా, తర్వాత ఆ విషయాన్ని సరదాగా తీసుకుని నవ్వుతో కవర్ చేసింది. ఆ వెంటనే బాలకృష్ణకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది. వివాదం ముదురుతూ ఉండటంతో హీరో విశ్వక్సేన్ స్పందిస్తూ.. ఈవెంట్లో జరిగింది వేరు, సామాజిక మాధ్యమాల్లో చూపించేది వేరన్నారు. వీడియోను ముందు, వెనుక కట్ చేసి కావాలనే వైరల్ చేస్తున్నారని.. బాలయ్య అందరితో సరదాగా ఉంటారని .. ట్రోలింగ్ ఆపాలని విశ్వక్సేన్ సూచించారు.
అంతేకాదు.. ఈ ఈవెంట్కు బాలయ్య మందు తాగి వచ్చారని, ఆయన సీటు పక్కన మద్యం బాటిల్ను హైలైట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మద్యం బాటిల్ నిజం కాదని.. మంచినీటి సీసాలో మందు ఉన్నట్లు సీజీ చేసి బాలకృష్ణను ట్రోల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా ఈ ఈవెంట్లో ఉన్నామని.. అక్కడేం జరిగిందో మాకు తెలియదా అని నాగవంశీ ప్రశ్నించారు. అలాగే అంజలి ఇష్యూపైనా ఆయన స్పందించారు. మరి వీరిద్దరి క్లారిటీతోనైనా వివాదం సద్దుమణుగుతుందా లేక మరో కొత్త పాయింట్ పట్టుకుని గోల చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

ఇకపోతే.. ఈ మూవీలో రత్నాకర్ అనే రాజకీయ నాయకుడి క్యారెక్టర్లో విశ్వక్సేన్ నటించారు. టీజర్, ట్రైలర్లో చూపించింది కొంతేనని, సినిమాలో చాలా ఉందని.. ఈ మధ్య సినిమా హాళ్లు మూసేశారని.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మళ్లీ థియేటర్లు కళకళలాడతాయని విశ్వక్సేన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటసింహం నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది, మధునందన్, ప్రవీణ్, గోపరాజు రమణ, తదితరులు కీలకపాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











