ఈ రోజు భారతీయ సినిమా ఏడ్చిన రోజు: రాజమౌళి!
హైదరాబాద్: కమల్ హాసన్ 'విశ్వరూపం' చిత్రం ఎదుర్కొంటున్న సమస్యలపై దర్శక ధీరుడు రాజమౌళి తొలి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి నుంచి ఆయన కమల్ హాసన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ రోజు తమిళనాడులో విశ్వరూపం చిత్రం ప్రదర్శితం అవుతున్న థియేటర్లను ధ్వంసంచేయడం, రెండు చోట్ల పెట్రోలు బాంబులు వేయడం, మరోసారి సినిమాపై ఈ రోజు మధ్యాహ్నం నుంచి బ్యాన్ అమలవుతున్న నేపథ్యంలో రాజమౌళి సోషల్ నెట్వర్కింగ్ పేజీలో ఈ క్రింది విధమైన వ్యాఖ్యాలు కనిపించాయి.
ఈ రోజు భారతీయ సినిమా ఏడ్చిన రోజు...
ఇలా పరిస్థితులు వస్తాయని ఎన్నడూ ఊహించలేదు. ఇది చాలా బాధాకరం!
రేపిస్టులకు - గివెన్ ఎ చాన్స్...
కళాకారులకు - నిషేదం-శిక్షలు!.
భారత్లో సెక్యూలరిజం అంటే ఇదేనా?
మేము కమల్ హాసన్ కు మద్దతు పలుకుతున్నాం..
మీరు...?
అంటూ రాజమౌళి పేస్బుక్ పేజీలో వ్యాఖ్యలు కనిపించాయి. విశ్వరూపం వివాదం గురించి మాట్లాడుకుంటే.... మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ కోర్టు 'విశ్వరూపం' చిత్రంపై నిషేదం ఎత్తివేసిందనే ఆనందం కమల్ హాసన్కు ఎంతో సేపు మిగల లేదు. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటీషన్ దాఖలు చేయడంతో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం వెంటనే స్పందించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ ఈ రోజు మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 'విశ్వరూపం' చిత్రంపై బ్యాన్ పడ్డట్లయింది.
కమల్ హాసన్ ఫిబ్రవరి 4లోగా సినిమాపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 6న మద్రాస్ హైకోర్టు నుంచి తుది తీర్పు వెలువడనుంది. మద్రాసు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కమల్ హాసన్ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.


Click it and Unblock the Notifications











