పవన్కు కోసం పిఠాపురానికి వరుణ్ తేజ్.. మిగిలిన మెగా స్టార్స్ సంగతేంటీ?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో అన్నట్లుగా తలపడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టి పదేళ్లు కావొస్తున్నా నేటి వరకు ఎన్నికల్లో సరైన సత్తా చాటలేదంటూ వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు తనను తాను నిరూపించుకోవాలని ఆయన పోరాడుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో పార్టీ అప్పుడే కొత్తగా పుట్టడం, పోటీ చేసే సమయం లేకపోవడంతో టీడీపీ - బీజేపీ కూటమికి పవర్స్టార్ మద్ధతు పలికారు. నాటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి పవన్ ఫ్యాక్టర్ కూడా కీలకమైనదే.
2019 ఎన్నికల నాటికి కూటమి నుంచి బయటకు వచ్చి టీడీపీ, బీజేపీలపై దుమ్మెత్తిపోశారు జనసేనాని. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది జనసేన. అన్నింటికి మించి తాను పోటీ చేసిన భీమవరం, గాజువాకలలో ఓడిపోవడం పవన్ ప్రతిష్టకే మచ్చ తెచ్చింది. జరిగిన నష్టాన్ని గ్రహించిన పవర్ స్టార్ ఈసారి అలాంటి తప్పులు జరగకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి ఏర్పాటును ముందు నుంచి ఆకాంక్షించారు. టీడీపీతో జట్టు కట్టి, బీజేపీ కూడా కూటమిలోకి అడుగుపెట్టడానికి తన వంతు కృషి చేశారు.

21 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్ధులతో పాటు కూటమి క్యాండిడేట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తన పదునైన విమర్శలతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. కానీ .. జనసేనాని పడుతున్న కష్టానికి ఆయన కుటుంబం, సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా జత కలుస్తారా అంటూ చర్చ జరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జనసేనకు కానీ, పవన్కు కానీ బహిరంగంగా మద్ధతు పలకని పవన్ పెద్దన్నయ్య , మెగాస్టార్ చిరంజీవి సైతం తొలిసారిగా రూ.5 కోట్ల విరాళం ఇవ్వడంతో పాటు కూటమి అభ్యర్ధులను గెలిపించాలని స్వయంగా పిలుపునిచ్చారు.
మరో సోదరుడు నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగా, తమ్ముడికి ఎప్పుడూ నీడలా వుంటూ వస్తున్నారు. తాజాగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా బాబాయ్ కోసం రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం, రోడ్ షో నిర్వహించనున్నారు వరుణ్ .
అంతా బాగానే వుంది కానీ మిగిలిన కుటుంబ సభ్యులు అల్లు అరవింద్, రాంచరణ్, అల్లు అర్జున్, సాయిథరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, అల్లు శిరీష్ల సంగతేంటనే చర్చ నడుస్తోంది. వీరిలో చరణ్, అల్లు అర్జున్లకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. వీరు నేరుగా ప్రచారానికి రాకపోయినా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా చాలు .. దాని ప్రభావం తీవ్రంగా వుంటుంది. ప్రస్తుతానికి వీరంతా మౌనంగా వున్నా.. త్వరలోనే పవన్ కళ్యాణ్కు మద్ధతు ప్రకటిస్తారేమోనని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











