నాగార్జున అక్కినేని ఎందుకు టార్గెట్.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక ఏం జరిగిందంటే?
టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున అక్కినేనికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం అటు తెలుగు సినిమా పరిశ్రమలోను, అలాగే ఇటు రాజకీయ వర్గాల్లోనే సంచలనం రేపింది. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత చెరువులను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేసే కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షణలో చేపట్టారు.
అయితే రిజిస్ట్రేషన్ నిబంధనలకు అనుగుణంగా పట్టా భూమిని కొనుగోలు చేశాం. మాకు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేత చేపట్టారు. కోర్టులో స్టే తీసుకు వచ్చాం అని ఎన్ కన్వెన్షన్ నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. మాకు ముందే చెబితే నేనే కూల్చివేతకు పూనుకొనే వాళ్లం. మమ్మల్ని టార్గెట్ చేయడం సరికాదు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే పట్టా భూమి గురించి, నోటీసుల గురించి ఎన్ కన్వెన్షన్ సమర్ధించుకొంటున్న విషయంపై రంగనాథ్ వివరణ ఇచ్చారు. తాము నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. FTL పరిధిలో ఉన్న కమర్షియల్ భవనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొన్నాం. మాపై వస్తున్న వార్తలు అవాస్తవాలు అని ఆయన అన్నారు.
నాగార్జున కొనుగోలు చేసింది పట్టా భూమినే. శిఖం భూమి అనే కేటాయిస్తారు. వర్షకాలంలో నీళ్లు ఉంటాయి. వేసవిలో చెరువులో నీళ్లు ఉండవు. ఆ సమయంలో ఓ పంట వేస్తారు. శిఖం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే పట్టా భూమిని ఉపయోగిస్తారు. పట్టా భూమిని అమ్ముకోవచ్చు. అది రిజిస్టర్ కూడా అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత దానిని వ్యవసాయానికే ఉపయోగించాలి అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
నాగార్జున అక్కినేని కొన్న భూమి పట్టా ల్యాండ్ అయినప్పటికి రూల్స్ ప్రకారం వ్యవసాయానికి వాడాలి. కానీ ఆయన భవనాలు నిర్మించి కమర్షియల్ పర్సస్ వాడుతున్నారు. అది నిబంధనలకు వ్యతిరేకం. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెగ్యులేషన్కు పర్మిషన్ రాలేదు. ఎందుకు పర్మిషన్ రాలేదో ఆయన చెప్పాలి కదా అని రంగనాథ్ ప్రశ్నించారు.
ఎన్ కన్వెన్షన్కు ముందుగానే నోటీసులు ఇచ్చాం. ఆ తర్వాతే మేము కూల్చివేత మొదలుపెట్టాం. మా కూల్చివేత వల్ల పెళ్లి చేసుకోవాలనే వారు ఇబ్బందికి గురి అయ్యారంటే అది మా బాధ్యత కాదు. మేము నోటీసులు ఇచ్చాం కాబట్టే వారు కోర్టులో స్టే తెచ్చుకొన్నారు. సమాజంలో ఎక్కువ మంది జరుగుతుందని భావిస్తే.. ఒక్కరిద్దరి గురించి మేము పట్టించుకోం. సమాజానికి మేలు జరిగే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అన్నారు.


Click it and Unblock the Notifications











