మహానాయకుడిని తలదన్నేలా లక్ష్మీస్ ఎన్టీఆర్!.. నిజాలు నిప్పులా? వర్మ వ్యూహం ఫలించబోతుందా?
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 29న రిలీజ్కు సిద్ధమవుతున్నది. విడుదలకు ముందే ఈ చిత్రం అనేక వివాదాల్లో చిక్కుకున్నది. టీజర్లకు, ట్రైలర్లకు మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్తో పోల్చడం సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే...

నమ్మిన నిజాలతోనే లక్ష్మీస్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించినప్పటి నుంచి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మొదలవుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబంలో చోటుచేసుకొన్న కుట్రలను, బయటకు తెలియని కొన్ని నిజాలను ఈ సినిమా ద్వారా వెల్లడిస్తాం. నేను నమ్మిన నిజాలతో సినిమాను తీశాం. ఇది అందరికీ నచ్చుతుంది అని వర్మ ఇటీవల వెల్లడించారు.

ఎన్టీఆర్ బయోపిక్ను తలదన్నేలా వర్మ
ఎన్టీఆర్ బయోపిక్లోని కథానాయకుడు, మహానాయకుడు సినిమాల తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ వస్తుండటంతో అత్యంత ఆసక్తి నెలకొన్నది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ బాక్సాఫీస్ బోల్తాపడటమే కాకుండా, కనీసం సినీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్లో వివాదాస్పద అంశాలు రాజకీయ, సామాజిక వర్గాలను ఆకట్టుకొంటాయనే మాట వినిపిస్తున్నది.

ఆర్జీవి టేకింగ్
ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొంటుందా అనే ప్రశ్న ప్రస్తుతం మిలియన్ డాలర్లుగా మారింది. అయితే ఈ సినిమా బడ్జెట్ పరంగా భారీగా కాకపోవడం కొంతలో కొంత ఉపశమనంగా కనిపిస్తున్నది. డిస్టిబ్యూటర్లను నష్టపరిచే అవకాశాలు తక్కువ. కథ, కథనాలు, వర్మ టేకింగ్ హైలెట్ అనే మాట వినిపిస్తున్నది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదంలో కూరుకుపోవడంతో సినిమాపై ప్రత్యేక అటెన్షన్ ఏర్పడింది. దాంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ మెరుగ్గా ఉంటాయి. మహానాయకుడు సినిమాతో పోల్చుకొంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ వసూళ్లు బ్రహ్మండంగా ఉంటాయి. ఎన్టీఆర్ బయోపిక్ కంటే కథ, కథనాల విషయంలో ఈ చిత్రం కొంత బెటర్గా ఉండొచ్చు అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

క్రేజీగా అడ్వాన్స్ బుకింగ్ ఒపెనింగ్స్
ఇదిలా ఉండగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్కు అనూహ్యమైన స్పందన వస్తున్నది. పలు ప్రాంతాల్లో అభిమానులు ముందే టికెట్లను రిజర్వు చేసుకోవడం కనిపిస్తున్నది. మహేష్బాబు సొంత మల్టీప్లెక్స్ ఏఎంబీలో 10 నిమిషాల్లోనే 1000 టికెట్లు అమ్మడం సినిమా క్రేజ్కు అద్దం పట్టింది. దీంతో తొలి వారాంతంలో భారీగా వసూళ్లు కురిసే అవకాశం లేకపోలేదనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











