బాపు మృతి: జగన్, బాలకృష్ణ సంతాపం
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు బాపు మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలుగు సినీ ప్రపంచం విషాద సముద్రంలో మునిగిపోయింది. చిత్రకళ, సినిమా వంటి రంగాల్లో తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి బాబు అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు.
బాపు మృతికి ఆయన సంతాపం ప్రకటించారు. బాపు కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. బాపు బొమ్మ ఎంతో ప్రాముఖ్యతను కలిగిందని ఆయన అన్నారు. భారతదేశం ఓ మహానుభావుడిని, మహా మనిషిని కోల్పోయిందని జగన్ అన్నారు. బాపు మృతికి ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు సంతాపం ప్రకటించారు. బాపును ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన అభివర్ణించారు.

బాపు మృతి తెలుగువారికి, తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నందమురి హీరో బాలకృష్ణ అన్నారు. బాపు - రమణ చిత్రాలు మణిమకుటాలు అని ఆయన అన్నారు. సాంఘిక, సామాజిక చిత్రాలు తీయడంలో బాపుది అందె వేసిన చేయి అని ఆయన అన్నారు. తెలుగునాట, తెలుగునోట బాపు పేరు అజరామరమని ఆయన అన్నారు. బాపు దర్శకత్వంలో నటించడం తన పూర్వజన్మసుకృతమని ఆయన అన్నారు.
తెలుగువారు ఉన్నంత కాలం బాపు, రమణ ఉంటారని ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాస రావు అన్నారు. బాపు మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అని ప్రముఖ నటి శారద అన్నారు. బాపు వంటి దర్శకలు లేరు, ఇక రారు అని ఆమె అన్నారు. బాపు, రమణలను ఎవరూ మించలేరని ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బాపు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అన్నారు. బాపు మృతికి ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ సంతాపం ప్రకటించారు.


Click it and Unblock the Notifications











