సినీ ప్రముఖులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎప్పటికైనా వెళ్లాల్సిందే అంటూ
గురువారం నాడు ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి నేతృత్వంలోని సినీ రంగ ప్రముఖులు తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. భేటీ తరువాత చిరంజీవి సహా సినీ ప్రముఖులు మీడియాతో కూడా మాట్లాడారు. అయితే సినీ ప్రముఖులతో జగన్ మాట్లాడిన విషయాలు ఆ తరువాత వెల్లడించారు. ఆ వివరాలు

20 శాతం షూటింగ్ లు
ఎవరి సినిమాకైనా టికెట్ ధర ఒకే రేటు ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అందరికీ న్యాయం జరిగేలా టికెట్ ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలను ప్రత్యేకంగా చూడాల్సిందేనని పేర్కొన్న ఆయన అలా చూడకపోతే భారీ ఖర్చుతో సినిమా చేయడానికి ఎవరూ కూడా ముందుకు రారని అభిప్రాయపడ్డారు. అలాగే తమ రాష్ట్రంలో సినిమా షూటింగ్ లను ప్రమోట్ చేస్తున్నామని జగన్ కనీసం 20 శాతం షూటింగ్ లు ఏపీ చేయాలని జగన్ సినీ ప్రముఖులను కోరారు.

పరిశ్రమ నిలబడేలా
ఆన్ లైన్ పద్దతిలో టికెట్ల విక్రయం అందరికీ మంచిదని జగన్ అభిప్రాయపడగా ఏడాదికి వెయ్యి రూపాయాలకే ఓటీటీలు సినిమాలు ప్రసారం చేస్తున్న విషయాన్ని కూడా టాలీవుడ్ ప్రముఖుల వద్ద ప్రస్తావించారు. కనీస ఆదాయం కూడా లేకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా ఉండదని అన్నారు. అందుకే అన్నీ సమతుల్యం చేసే విధంగా టికెట్ ధరలను నిర్ణయిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ప్రేక్షకులకు భారం కాకుండా, పరిశ్రమ నిలబడేలా టికెట్ రేట్లు ఉంటాయని జగన్ తెలిపారు.

పోటీపడే సత్తా
ఇక " హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తో పోటీపడే సత్తా విశాఖపట్టణానికి ఉందని జగన్ చెప్పారు. అందుకే టాలీవుడ్ ను అక్కడ విస్తరించాలని ఆయన కోరారు. విశాఖను మనది అనుకోని ఏమైనా చేయాలని అన్నారు. విశాఖపట్టణంలో సినిమా స్టూడియోల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను కూడా ఇస్తుందని జగన్ హామీ ఇచ్చారు. విశాఖను హైదరాబాద్ జూబ్లీహిల్స్ తరహాలో అభివృద్ధి చేద్దామని సీఎం జగన్ సినీ ప్రముఖులను కోరారు. ఏదో ఒక రోజు మనమంతా విశాఖపట్టణానికి వెళ్లాల్సిందేనని సీఎం జగన్ పేర్కొన్నారు.

చిన్న సినిమాల గురించి
తెలంగాణతో పోలిస్తే ఇండస్ట్రీకి ఏపీ నుంచి కంట్రిబ్యూషన్ ఎక్కువ అని తెలంగాణ నుంచి 40 శాతం ఆదాయం వస్తే ఏపీ నుంచి 60 శాతం ఆదాయం వస్తోందన్నారు. ఈ క్రమంలో భారీ బడ్జెట్ సినిమాలు తీయడంలో రాజమౌళి నిపుణుడని జగన్ ప్రశంసించారు. మంచి సినిమాలు, పెద్ద సినిమాలు చేయాలని కోరుతూనే చిన్న సినిమాల గురించి సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిన్న సినిమాలను కూడా రక్షించుకోవాలని జగన్ అభిప్రాయపడ్డారు. దీనికోసం కార్యాచరణ చేసుకోవాలని కోరుతున్నానని సీఎం జగన్ చెప్పారు.

విశాఖలో స్థలాలు
అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తామని స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తామన్నారు. చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్లతో విశాఖపట్నం పోటీపడగలదన్నారు. మనం ఓన్ చేసుకోవాలి..మనందరం అక్కడకి వెళ్లాలని రిక్వెస్ట్ చేస్తున్నానని అన్నారు. మొత్తం మీద ఏపీ సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.


Click it and Unblock the Notifications











