Acharya Pre Release Event కి ముఖ్యఅతిధిగా వైఎస్ జగన్.. జరిగేది ఎక్కడంటే?
మెగాస్టార్ హీరోగా నటించిన ఆచార్య సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగవచ్చు అని ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు అనూహ్యంగా మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video


కొరటాల శివ దర్శకత్వంలో
సైరా నరసింహారెడ్డి సినిమా చేసిన తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాను ప్రారంభించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమైంది కానీ కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ముందుగా మెగాస్టార్ చిరంజీవి సరసన మహేష్ బాబు నటిస్తాడు అంటూ ప్రచారం జరిగింది కానీ అనుకోని రీతిలో రామ్ చరణ్ తేజ ప్రాజెక్టు లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పాత్ర నిడివి పెంచడమే కాక ఆయనకు హీరోయిన్ ని కూడా సెట్ చేశారు.

సంయుక్తంగా
అలా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూండగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సోనూసూద్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అనేకమంది కీలక నటీనటులు కూడా నటించారు. ఈ సినిమాను మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మించారు.

విజయవాడలో
అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పటిలాగే హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్న మైదానంలో జరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన మరికొంతమంది హీరోలు హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఆయన ద్వారానే
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన అవకాశం ఉందని అంటున్నారు.. ఎందుకంటే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నిరంజన్ రెడ్డి వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులు.. గతంలో మెగాస్టార్ చిరంజీవి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ కూడా ఆయన ద్వారానే జరిగిందని తెలుస్తోంది.

అధికారిక ప్రకటన
ఈ నేపథ్యంలో 23 వ తేదీన జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకావాల్సిందిగా నిరంజన్ రెడ్డి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరడంతో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యేందుకు ఒప్పుకున్నారని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కానీ లేదా ఏదైనా కాలేజ్ గ్రౌండ్ లో గాని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడితే కానీ ఎక్కడ జరుగుతుంది అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











