60 కోట్ల వివాదం.. లాస్ట్ మినిట్లో ట్విస్ట్ ఇచ్చిన పీవీఆర్, స్టార్ హీరోకి హైకోర్ట్ షాక్
కరోనా సినిమాలో అందుబాటులోకి ఓటీటీలు నిర్మాతలకు అదనపు ఆదాయాన్ని, నష్టాల నుంచి ఉపశమనం పొందే మార్గాలను ఇస్తున్నప్పటికీ ఓటీటీల కారణంగా అనేక సినిమాలు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఓటీటీ కాంట్రాక్ట్లు, రిలీజ్ ఒప్పందాలు న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకుని సినిమాల విడుదలలే ఆగిపోతున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావ్ లేటెస్ట్ మూవీ భూల్ చుక్ మాఫ్ వివాదంలో ఇరుక్కుంది. ఈ వివరాల్లోకి వెళితే..
వివాదాల్లో ఓటీటీ ఒప్పందాలు
ఈ ఏడాది మార్చిలో కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన వీర ధీర శూర సినిమా సరిగ్గా విడుదల రోజున ఇబ్బందుల్లో పడింది. థియేట్రిలక్ రిలీజ్ కంటే ముందే ఓటీటీ రైట్స్ తమకు అమ్ముతామని నిర్మాతలు తమతో అగ్రిమెంటో చేసుకున్నారని.. కానీ ఈ డీల్ క్లోజ్ చేయకుండానే సినిమాను విడుదల చేస్తున్నారంటూ ముంబైకి చెందిన ఓ సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దాంతో మ్యాట్నీ వరకు షోలు రద్దయి సినిమా వసూళ్లపై ప్రభావం చూపింది. ఇలాంటి ఉదంతాలు ఈ మధ్య ఎన్నో. తాజాగా ఇదే రకమైన వివాదంలో చిక్కుకుంది రాజ్ కుమార్ రావ్ నటించిన భూల్ చుక్ మాఫ్.

రాజ్ కుమార్ రావ్ హీరోగా భూల్ చుక్ మాఫ్
ఈ చిత్రంలో రాజ్కుమార్ రావు, వామికా గబ్బీ హీరో హీరోయినల్లుగా నటించారు . కరణ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. సీమా పహ్వా, సంజయ్ మిశ్రా, జకీర్ హుస్సేన్, రఘుబీర్ యాదవ్, ఇస్తియాక్ ఖాన్, జయ్ థక్కర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, మద్దూక్ ఫిలిమ్స్ బ్యానర్పై దినేష్ విజాన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ నిర్మించారు. భూల్ చుక్ మాఫ్ చిత్రానికి కేతన్ సోదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా.. తనిష్క్ బాగ్చి మ్యూజిక్ డైరెక్టర్గా, సందీప్ ఛటర్జీ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. టీమిండియా స్టార్ క్రికెటర్ యజువేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడంతో భూల్ చుక్ మాఫ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
భారత్ - పాక్ యుద్ధంతో ఓటీటీలోకి
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. మే 9న భూల్ చుక్ మాఫ్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం పాకిస్తాన్పై భారత్ మెరుపు దాడులతో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులతో రిలీజ్ను రద్దు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. దానికి బదులుగా మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా భూల్ చుక్ మాఫ్ను డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
నిర్మాతలపై కోర్టుకెక్కిన పీవీఆర్
నిర్మాతల నిర్ణయం ఇప్పుడు వివాదానికి కారణమైంది. మే 9న సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో ఆన్లైన్లో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా వేలాది మంది టికెట్లు కొనుగోలు చేశారు. ఆ వెంటనే భూల్ చుక్ మాఫ్ను ఓటీటీలో డైరెక్ట్గా విడుదల చేస్తామని చెప్పడంతో ప్రేక్షకులు షాకయ్యారు. అటు ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ .. నిర్మాతల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. భూల్ చుక్ మాఫ్ కోసం తాము ఎంతో ఖర్చు చేశామని.. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడం సరికాదంటూ రూ.60 కోట్ల దావా వేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన బాంబే హైకోర్టు.. ఓటీటీ రిలీజ్పై స్టే విధించడంతో పాటు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎక్కడా విడుదల చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది. మరి దీనిపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











