బూతు యాప్స్పై కేంద్రం నిషేధం.. ఆ ఓటీటీ నాది కాదు.. స్టార్ ప్రొడ్యూసర్ రియాక్షన్
ప్రభుత్వం, పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా ఆన్లైన్లో విచ్చలవిడిగా అశ్లీలం చక్కర్లు కొడుతూనే ఉంది. మారుపేర్లతో, ఏదో ఒక ప్రాంతం నుంచి ఈ కంటెంట్ను ప్రసారం చేస్తున్నారు కేటుగాళ్లు. ఓటీటీలు, వెబ్సైట్స్కి ఎలాంటి సెన్సార్ షిప్ లేకపోవడంతో వీరంతా రెచ్చిపోతున్నారు. వీటిపై ఓ సమగ్ర విధానం, కట్టడి చేసే వ్యవస్థ ఉండాలని పలువురు మేధావులు చెబుతున్నారు. సుప్రీంకోర్ట్ సైతం పలుమార్లు ఓటీటీల నియంత్రణకు మార్గదర్శకాలు ఉండాలని సూచించింది.
కోట్లలో సంపాదిస్తున్న యాప్స్
ఇండియాలో అశ్లీల వెబ్సైట్స్పై నిషేధం అమల్లో ఉంది. అయితే అనేక ప్రత్యామ్నాయ మార్గాల్లో కోట్లాది మంది ఈ బూతు కంటెంట్ను వీక్షిస్తున్నారు. వీరిలో అన్ని వయసుల వారు ఉన్నారు. దీని కారణంగా యువత నిర్వీర్వం కావడంతో పాటు చిన్నారులు, బాలికలు, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కఠినమైన చట్టాలు లేకపోవడంతో వెబ్సైట్స్, యాప్స్ రెచ్చిపోతున్నాయి. ఏకంగా సబ్స్క్రిప్షన్ ఫీజు పెట్టి మరి అశ్లీల కంటెంట్ను అందిస్తూ కొన్ని యాప్స్ కోట్లలో సంపాదిస్తున్నాయి.

25 యాప్స్పై నిషేధం
తాజాగా అశ్లీల కంటెంట్ను ప్రసారం చేస్తున్న 25 యాప్స్పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ కొరడా ఝళిపించింది. ఆయా యాప్లు, వెబ్సైట్ల లింకులు ప్రజలకు అందుబాటులో ఉండకుండా చర్యలు చేపట్టాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 67, 67ఏ తో పాటు ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 294, మహిళను అసభ్యంగా చూపించడం వంటి చట్టాల కింద వీటిపై నిషేధాన్ని విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర హోంశాఖ, మహిళా శిశు అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, FICCI, CIIలతో సంప్రదించి ప్రసార శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
నిషేధించిన యాప్స్ ఇవే
కేంద్రం నిషేధించిన యాప్స్ జాబితాలో.. ఉల్లూ, ఏఎల్టీటీ, బిగ్ షాట్స్ యాప్, దేశీఫ్లెక్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, హిట్ ప్రైమ్, ఫెనియో, షో ఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్ఎక్స్ వీఐపీ, హల్చల్ యాప్, మూడెక్స్, నియోన్ ఎక్స్ వీఐపీ, ఫూగీ, మోజిక్స్, ట్రిప్లిక్స్ ఉన్నాయి.
ఆ ఓటీటీ మాది కాదన్న నిర్మాత
అయితే ఈ యాప్స్లో ఏఎల్టీటీపై నిషేధం పరిశ్రమ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో ఇది ఏఎల్టీ బాలాజీ అనే పేరుతో ఉండేది. హిందీలో సీరియల్స్, సినిమాలు నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిలిమ్స్ సంస్థ దీనికి ఓనర్. బాలీవుడ్ దిగ్గజం జితేంద్ర సతీమణి శోభాకపూర్, కుమార్తె ఏక్తాకపూర్ దీనికి సారథ్యం వహించేవారు. ఏఎల్టీటీపై కేంద్రం నిషేధం నేపథ్యంలో ఏక్తాకపూర్ స్పందించారు. తాను, తన తల్లి శోభాకపూర్లకు ఏఎల్టీటీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. జూన్ 2021లోనే తాము ఏఎల్టీటీ నుంచి తప్పుకున్నామని ఏక్తా క్లారిటీ ఇచ్చారు. ఆ సంస్థలో తాము ఏ హోదాలోనూ విధులు నిర్వర్తించడం లేదని.. వాస్తవాలు తెలుసుకుని కథనాలు అందించాలని మీడియాకు ఏక్తాకపూర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఆమె ప్రకటన విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











