స్టార్ హీరోకి ఘోర అవమానం.. ఆ సినిమా మాకొద్దన్న ఓటీటీ సంస్థలు
కరోనా రాకతో ప్రేక్షకుడు సినిమా చూసే విధానం పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. కంటెంట్ లేని సినిమాలను జనం తిప్పికొడుతున్నారు. ఎంత పెద్ద స్టార్ నటించినా, స్టార్ కాంబినేషన్లతో వచ్చినా ఛాన్స్ ఇవ్వడం లేదు. అలాగే థియేటర్కు వెళ్లి వేలకు వేలు వదిలించుకోకుండా సెలెక్టీవ్గా సినిమాలు చూస్తున్నారు. బాగుందనే టాక్ వచ్చిన నాలుగైదు రోజులకు కానీ ఇల్లు కదలడం లేదు. కొందరైతే నాలుగు వారాలు గడిస్తే అదే ఓటీటీలోకి వస్తుంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
విచ్చలవిడిగా పుట్టుకొచ్చిన ఓటీటీ కంపెనీలు ప్రేక్షకులకు సరసమైన ధరల్లోనే వినోదాన్ని అందిస్తున్నాయి. నిర్మాతలకు కూడా ఓటీటీలు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. చిన్న నిర్మాతలకు ఇది ఒక వరంలా మారగా.. కాస్త పేరున్న కాంబినేషన్, స్టార్ హీరోల సినిమాలకైతే వందల కోట్లు కుమ్మరించేందుకైనా ఓటీటీ సంస్థలు వెనుకాడటం లేదు. ఇప్పటికే ఈ విషయం చాలా మంది హీరోల విషయంలో ప్రూవ్ అయ్యింది. ఓటీటీ రైట్స్ విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు హీరోలు.

అయితే కొందరు స్టార్ హీరోల సినిమాలకు ఓటీటీలలో అస్సలు గిట్టుబాటు కావడం లేదు. కొందరైతే తమ సినిమాను కొనమని ఓటీటీ సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పరిస్ధితినే ఎదుర్కొన్నారు బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం. ఆయన హీరోగా వచ్చిన తాజాగా చిత్రం ది డిప్లొమాట్. భారత్ - పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.
శివమ్ నాయర్ దర్శకత్వం వహించిన ది డిప్లొమాట్లో సాదియా ఖతీబ్, కుముద్ మిశ్రా, షారిబ్ హష్మీ, రేవతి, అశ్వత్ భట్, జగజ్జిత్ సంధు తదితరులు కీలకపాత్రలు పోషించారు. టీ- సిరీస్ ఫిల్మ్స్, జేఏ ఎంటర్టైన్మెంట్స్, వాకూ ఫిల్మ్స్, సీతా ఫిల్మ్స్, ఫార్చ్యూన్ పిక్చర్స్ బ్యానర్లపై దాదాపు 9 మంది ది డిప్లొమాట్ చిత్రాన్ని నిర్మించారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను హోలీ కానుకగా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
టీజర్, ట్రైలర్తో పాటు మార్నింగ్ షో నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి రోజున రూ.4 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టగా.. 7 రోజుల వరకు రూ.20 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. అలాంటి ది డిప్లొమాట్ సినిమాను కొనేందుకు ఏ ఓటీటీ సంస్థా ముందుకు రాలేదట. ఈ విషయాన్ని స్వయంగా హీరో జాన్ అబ్రహం బయటపెట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ది డిప్లొమాట్ షూటింగ్ పూర్తయ్యాక ఎన్నో స్టూడియోలను తిరిగామని, ఓటీటీలను సంప్రదించామని అయినప్పటికీ ఎవ్వరూ దీనిని కొనేందుకు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే సినిమా రిలీజ్ అయ్యాక వారి నిర్ణయం తప్పని రుజువైందని జాన్ అబ్రహం అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నట్లు ది డిప్లొమాట్ డిజిటల్ రైట్స్ను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ , శాటిలైట్ రైట్స్ను సోనీ మ్యాక్స్లు సొంతం చేసుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.


Click it and Unblock the Notifications











