Drishyam 3 OTT: ఓటీటీలోకి దృశ్యం 3.. మోహన్లాల్ క్రైమ్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
దృశ్యం ఫ్రాంచైజీలో భాగంగా తాజాగా తెరకెక్కిన మూవీ దృశ్యం 3. మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, సీనియర్ నటి మీనా జంటగా నటించగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటోనీ పెరంబవూర్ దృశ్యం 3ని నిర్మించారు. అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్ధిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, ఆంటోనీ పెరంబవూర్, శ్రీకాంత్ మురళి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సతీష్ కురుప్ సినిమాటోగ్రాఫర్గా, వీఎస్ వినాయకన్ ఎడిటర్గా సేవలందించారు.
అనిల్ జాన్సన్ సంగీత దర్శకత్వం వహించారు. సమ్మర్ కానుకగా మే 21న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్లాల్ క్రేజ్కు తోడు దృశ్యం ఫ్రాంచైజీ ట్రాక్ రికార్డ్ కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో దృశ్యం 3 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను ఏ సంస్థ దక్కించుకుంది? ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది? అనేది పరిశీలిస్తే..

నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి దృశ్యం 3 మూవీని దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించినట్లు మలయాళ సినీ వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణాదితో పాటు నార్త్లోనూ క్రేజ్ ఉన్న ఫ్రాంచైజీ కావడంతో దృశ్యం 3కి భారీ బిజినెస్ జరిగింది. మోహన్లాల్ మూవీకి దాదాపు 350 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దృశ్యం 3 లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు 375 కోట్ల రూపాయలు వసూలు చేయాలని బ్రేక్ఈవెన్ టార్గెట్గా నిర్దేశించారు.
అటు దృశ్యం 3 నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ 30 కోట్ల రూపాయల భారీ ధరతో దృశ్యం 3 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది. దీనితో పాటు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ను ఏషియా నెట్ సంస్థ దాదాపు 15 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఓటీటీ డీల్ వివాదంలో చిక్కుకోవడంతో పాటు కోర్టుల వరకు వెళ్లింది.
అమెజాన్తో కుదుర్చుకున్న ఓటీటీ డీల్ను దృశ్యం 3 నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ అనూహ్యంగా రద్దు చేసుకుంది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అమెజాన్ ప్రైమ్ సంస్థ గత నెలలో ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. అమెజాన్ సంస్థకు అనుకూలంగా తీర్పు చెప్పింది. నిర్మాతలు మరో సంస్థతో ఓటీటీ డీల్ కుదుర్చుకోరాదని ఆదేశించింది. ఈ వివాదం కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అమెజాన్ సంస్థకు, దృశ్యం 3 నిర్మాతలకు మధ్య రాజీ కుదిరినట్లుగా మలయాళ సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్లో రిలీజైన 30 నుంచి 35 వారాల తర్వాత దృశ్యం 3ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది. దీని ప్రకారం జూన్ చివరి వారంలో దృశ్యం 3 ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉంది. అయితే థియేట్రికల్ రన్ను బట్టి ఓటీటీ రిలీజ్ ముందుకు జరగొచ్చు.. లేదంటే ఆలస్యం కావొచ్చు. దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్పై అమెజాన్ ప్రైమ్ సంస్థ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications



