5 కోట్లతో తీస్తే రూ. 50 కోట్ల వసూళ్లు... దళపతికే చెమటలు పట్టించిన మూవీ ఓటీటీలోకి, ఎందులో అంటే?
ఓటీటీల రాకతో ప్రపంచం నలుమూలల్లో ఉన్న ఒరిజినల్ కంటెంట్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లో టికెట్ ధరల పెంపుతో మధ్య తరగతి ప్రజలకు భారమైన వేళ ఓటీటీలు ఈ వర్గాన్ని ఆదుకున్నాయి. ఒక సినిమాకు పెట్టే ఖర్చుతో ఏడాది మొత్తం ఇంటిల్లిపాది ఎక్కడికి వెళ్లకుండానే ఇంట్లోనే సినిమా చూసే అవకాశం దక్కింది. కాకపోతే.. లేట్గా సినిమా చూడాలని బాధ చాలా మందిని వెంటాడుతోంది. ప్రతి వారం ఓటీటీలలోకి వచ్చే సినిమాల గురించి ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ అనౌన్స్ చేస్తుంటాయి. తమిళ్లో సూపర్ హిట్ అయిన ఓ సినిమా ఓటీటీకి రంగం సిద్ధం చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..
గత కొంతకాలంగా సరైన విజయాలు లేక డీలా పడ్డ తమిళ చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది కొంత ఊరట కలిగించింది. విజయ్ ది గోట్ తదితర సినిమాలు తమిళ నిర్మాతలకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. అయితే అనుకోకుండా హిట్గా నిలిచి బయ్యర్లకు , డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందించింది లబ్బర్ పండు (రబ్బర్ బంతి). హరీష్ కళ్యాణ్, దినేష్, శ్వాసిక, సంజన కృష్ణమూర్తి నటించిన ఈ సినిమాకు తమిళరాసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్, ఏ వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషన్ కార్యక్రమాలు కలిపి రూ.5 కోట్లతో తెరకెక్కిన లబ్బర్ పండు చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఒకానొక దశలో ఇళయ దళపతి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ది గోట్కే సవాల్ విసిరింది ఈ సినిమా. లబ్బర్ పండు 18వ రోజున .. విజయ్ గోట్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.4 కోట్ల కలెక్షన్స్ వస్తే ఈ చిన్న సినిమా ఒక్క తమిళనాడులోనే రూ. 2.75 కోట్లు వసూళ్లు సాధించి షాకిచ్చింది.
ఓ గ్రామంలో ఇద్దరు గల్లీ క్రికెటర్ల మధ్య చోటు చేసుకున్న ఇగోల మధ్య వారి జీవితంలో ఏం జరిగింది? ఎలాంటి పరిస్ధితులు చోటు చేసుకున్నాయి? క్రికెట్లో ఈ ఇద్దరు మిత్రుల మధ్య ఏం జరిగింది? అన్నదే ఈ లబ్బర్ పండు కథ. గ్రామీణ వాతావరణానికి తోడు రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్తో తమిళరాసన్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. విడుదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న లబ్బర్ పండు అన్ని వర్గాలను ఆకట్టుకుంది. ముఖ్యంగా యువత ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఐఎండీబీ ఈ మూవీకి ఏకంగా 8.9 రేటింగ్ ఇవ్వడం విశేషం.
థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న లబ్బర్ పండు ఓటీటీ స్ట్రీమింగ్ కూడా ఫిక్స్ చేసుకుంది. సింప్లీ సౌత్ ఓటీటీ అక్టోబర్ 18 నుంచి విదేశాల్లో స్ట్రీమింగ్ కాగా.. ఓటీటీ దిగ్గజం డిస్నీ + హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ని భారీ ధరకు దక్కించుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 31 నుంచి లబ్బర్ పండు తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని డిస్నీ + హాట్ స్టార్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. థియేటర్లో విధ్వంసం సృష్టించిన ఈ స్పోర్ట్స్ డ్రామా.. ఓటీటీలో ఎలాంటి రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











