Emergency OTT Release: ఓటీటీలోకి 'ఎమర్జెన్సీ'.. కంగనా మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
యథార్ధ సంఘటనలు, బయోపిక్స్ను ప్రజలు ఆదరిస్తుండటంతో దర్శక నిర్మాతలు అదే జోనర్లో సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు. అయితే వాస్తవ ఘటనలను సినిమాగా తీసేటప్పుడు కొన్ని వివాదాస్పద అంశాల జోలికి వెళ్తుండటంతో ఆయా సినిమాలు చిక్కుల్లో పడుతున్నాయి. బాలీవుడ్ క్వీన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమర్జెన్సీ మూవీ కూడా ఎన్నో అవాంతరాలను దాటుకుని రిలీజైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీకి సంబంధించి కంగన అధికారికంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జీవితంలోని కొన్ని ఘట్టాల ఆధారంగా కంగనా రనౌత్ .. ఎమర్జెన్సీ సినిమాను తెరకెక్కించగా సెన్సార్ బోర్డ్ నుంచి అనుమతి లభించలేదు. ఇందిర పాలనతో పాటు భారతదేశ చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచిన ఎమర్జెన్సీకి సంబంధించి ఈ సినిమాలో కీలక విషయాలను ప్రస్తావించారు. కంగనా రనౌత్ స్వయంగా ఇందిరా గాంధీ పాత్రను పోషించారు. మణికర్ణిక ఫిలింస్, జీ స్టూడియో బ్యానర్లపై కంగనా రనౌత్, జీ స్టూడియోస్, రేణు పిట్టిలు దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్తో చిత్రాన్ని నిర్మించారు. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరీ, మిలింద్ సోమన్, సతీష్ కౌశీక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ట్రైలర్, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచింది. అయితే ఈ సినిమాలో ఖలిస్తాన్ ఉద్యమం, స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్, బంగ్లాదేశ్ విమోచన ఉద్యమం వంటి అత్యంత సున్నితమైన అంశాలను కంగన టచ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే సిక్కుల మనోభావాలు దెబ్బతినేలా ఎమర్జెన్సీ మూవీలో సన్నివేశాలు ఉన్నాయంటూ సిక్కుల అత్యున్నత సంస్థ శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్జీపీసీ) సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. అంతేకాదు స్వయంగా కంగనను చంపేస్తామంటూ బెదిరింపులు సైతం వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమర్జెన్సీకి సెన్సార్ బోర్డ్ నుంచి అనుమతి లభించకపోవడంతో మూవీ రిలీజ్ ఆగిపోయింది.
దీంతో న్యాయపోరాటానికి దిగిన కంగన.. బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు జోక్యంతో సినిమాలోని సున్నితమైన కంటెంట్ను తొలగిస్తే ప్రదర్శనకు అనుమతిస్తామని సెన్సార్ బోర్డ్ తేల్చి చెబుతూ.. 13 కట్లను సూచించింది. ఇందుకు కంగనా రనౌత్ కూడా అంగీకరించడంతో సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ జారీ చేసింది. అన్ని అడ్డంకులను దాటుకుని జనవరి 17న ఎమర్జెన్సీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సంచలనం సృష్టించలేదు. రూ.60 కోట్లతో ఎమర్జెన్సీని తెరకెక్కించగా.. లాంగ్ రన్లో రూ.21 కోట్లు మాత్రమే రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి.

థియేట్రికల్ రన్ ముగియడంతో ఎమర్జెన్సీ ఓటీటీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్కు ముగింపు పలుకుతూ ఎమర్జెన్సీ ఓటీటీ స్ట్రీమింగ్పై కీలక ప్రకటన చేశారు కంగన. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ వేదికగా మార్చి 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. థియేటర్లో అంతంత మాత్రంగా ఆడిన ఎమర్జెన్సీ .. ఓటీటీలో ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











