డబుల్ ఇస్మార్ట్, తంగలాన్, మిస్టర్ బచ్చన్లు వచ్చేది ఈ ఓటీటీల్లోనే.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?
ప్రభాస్ - నాగ్ అశ్విన్ల కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898 ఏడీ థియేటర్లకు కొత్త కళ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలు లేక వెలవెలబోయిన థియేటర్లలో ప్రభాస్ పండుగ తీసుకొచ్చాడు. చాలా రోజులుగా ఇంటికే పరిమితమైన మిడిల్ క్లాస్ ఆడియన్స్ కుటుంబాలతో సహా పోటెత్తడంతో కల్కికి కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ జోష్ను కంటిన్యూ చేస్తూ వరుసపెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఆగస్ట్ 15న ఏకంగా ఐదు క్రేజీ మూవీస్ విడుదలయ్యాయి.
సాధారణంగా తెలుగు సినిమాకు అతిపెద్ద సీజన్ సంక్రాంతి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా .. తెలుగువారు ఈ నాలుగు రోజులు స్వగ్రామానికి రావాల్సిందే. అందుకే టాలీవుడ్ జనాలు పెద్ద పండుగను టార్గెట్ చేసుకుని విడుదల కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ టైంలో ఎన్ని సినిమాలు వచ్చినా మరో సినిమాకు స్కోప్ ఉంటుంది. ఈ సీజన్ తర్వాత సమ్మర్ను తెలుగు చిత్ర పరిశ్రమ టార్గెట్ చేస్తుంటుంది. ఈసారి వేసవి ఊసూరుమనిపించింది. అలాంటి వేళ ఈ ఆగస్ట్ 15 కానుకగా చిన్నాచితకా కలిపి ఓ ఐదారు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

వరుస సెలవులు, లాంగ్ వీకెండ్ను దృష్టిలో ఉంచుకుని రామ్- పూరి జగన్నాథ్ల డబుల్ ఇస్మార్ట్, హరీశ్ శంకర్ - రవితేజల మిస్టర్ బచ్చన్, కోలీవుడ్ స్టార్ విక్రమ్ నటించిన తంగలాన్, ఎన్టీఆర్ బావమరిది నితిన్ నటించిన ఆయ్లు గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ఏ మూవీ దానికదే ప్రత్యేకం.. వారి ఆడియన్స్ వాళ్లకు ఉన్నారు. థియేటర్లో రిలీజ్ అయ్యిందో లేదో, ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు అంటూ జనాలు అడుగుతున్నారు. ఈ సస్సెన్స్కు ఆయా సినిమాల మేకర్స్ తెరదించారు.
దీనిలో భాగంగా మిస్టర్ బచ్చన్ ఓటీటీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ రెండో వారం నాటికి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా టోటల్ రన్ను బట్టి.. ఇంకాస్త ముందొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక మొదటి నుంచి హైప్ క్రియేట్ చేసిన పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ ఓటీటీ రైట్స్ కోసం భారీస్థాయిలో పోటీ నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులను ఆమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. దక్షిణాది భాషల్లో డబుల్ ఇస్మార్ట్ డిజిటల్ రైట్స్ను రూ.33 కోట్లకు అమెజాన్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ హిందీ వెర్షన్ డీల్ మాత్రం ఇంకా క్లోజ్ కాలేదు. సౌత్లో డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను అమెజాన్ త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

తమిళ అగ్రనటుడు చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా.. పలు అడ్డంకులను అధిగమించి ఆగస్ట్ 15న విడుదలైంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను ఈ సంస్థ కన్ఫర్మ్ చేయనుంది. వీటితో పాటు కీర్తి సురేశ్ నటించిన రఘుతాతాను జీ5.. శ్రద్ధాకపూర్ నటించిన స్త్రీ-2ను ప్రైమ్ వీడియో, అక్షయ్ కుమార్ నటించిన ఖేల్ ఖేల్ మే ఓటీటీ హక్కును నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











