Dhootha: అక్కినేని ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. డేట్ ఫిక్స్ చేసుకున్న ధూత
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ సత్తా చాటుతోన్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. ప్రతి సినిమాలోనూ వైవిధ్యాన్ని చూపిస్తూ తన రేంజ్ను పెంచుకుంటోన్న అతడు.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం నాగ చైతన్య పెద్దగా ప్రభావాన్ని చూపించడం లేదు. అయినప్పటికీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ధూత' అనే వెబ్ సిరీస్తో రాబోతున్నాడు.
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అక్కినేని నాగ చైతన్య.. ఇప్పుడు అమెజాన్ సంస్థ కోసం 'ధూత' అనే వెబ్ సిరీస్ను కూడా చేశాడు. విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన దీనితో అతడు డిజిటల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తోన్న నేపథ్యంలో ఈ సిరీస్పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని అత్యధిక బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్లు అమెజాన్ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను అధికారికంగా ప్రకటించారు.

ఫేమస్ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసిన 'ధూత' వెబ్ సిరీస్ను గత ఆగస్టులోనే స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, అలా జరగకపోవడంతో ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో నాగ చైతన్య వెబ్ సిరీస్ను డిసెంబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా అమెజాన్ సంస్థ ప్రకటించింది. ఇందుకోసం ఓ పోస్టర్ను సైతం విడుదల చేసింది. ఇందులో నాగ చైతన్యను చూపించడంతో పాటు బ్యాగ్రౌండ్లో ఓ కథను కూడా అక్షర రూపంలో పెట్టారు. దీంతో ఈ సిరీస్పై అంచనాలు పెరిగిపోయాయి.
క్రేజీ కాంబినేషన్లో రూపొందిన 'ధూత' వెబ్ సిరీస్లో అక్కినేని నాగ చైతన్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక, ఇందులో అతడికి జోడీ ప్రియ భవానీ శంకర్ నటిస్తోంది. ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ సిరీస్ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.


Click it and Unblock the Notifications











