Newsense Review: రిపోర్టర్ల జీవితాన్ని చూపించే 'న్యూసెన్స్'.. నవదీప్, బిందు మాధవి ఎలా చేశారంటే?
టైటిల్: న్యూసెన్స్
నటీనటులు: నవదీప్, బిందు మాధవి, షెల్లీ నబు కుమార్, నందగోపాల్, రమేష్ కోనంభోట్ల, చరణ్ కురుగొండ, పూర్ణ చంద్ర, జ్ఞానేశ్వర్ దేవనపల్లి తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
మాటలు: జయసింహా నీలం
కథ: ప్రియదర్శిని రామ్
దర్శకత్వం: ప్రవీణ్ శ్రీ (శ్రీ ప్రవీణ్ కుమార్)
విడుదల తేది: మే 12, 2023
ఓటీటీ వేదిక: ఆహా
ఎపిసోడ్స్: 6, నిడివి: సుమారు 30 నిమిషాలు
హీరో నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ న్యూసెన్స్. ఈ వెబ్ సిరీస్ కు గాయం 2, కాళీ చరణ్ సినిమాల డైరెక్టర్ ప్రవీణ్ దర్శకత్వం వహించారు. అలాగే కార్తికేయ 2, ధమాకా, రామబాణం చిత్రాలను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగ వ్యవహరించారు. 1990-2000 దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె ప్రాంతానికి చెందిన ప్రెస్ క్లబ్ లోని స్ట్రింగర్స్ కు సంబంధించిన కథాంశంతో ఈ సిరీస్ తెరక్కింది. మే 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న న్యూసెన్స్ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో (Newsense Web Series Telugu Review) తెలుసుకుందాం.

కథ: శివ (నవదీప్) మదనపల్లెలో రిపబ్లిక్ న్యూస్ రిపోర్టర్ గా పని చేస్తుంటాడు. శివ క్లాస్ మేట్, గర్ల్ ఫ్రెండ్ నీల (బిందు మాధవి) సిటీ కేబుల్ ఛానెల్ లో యాంకర్ గా చేస్తుంటుంది. వీరందరితోపాటు మరికొంతమంది కొడవలి తదితర ఛానెళ్లలో పనిచేస్తుంటారు. వీరందరికి అనుసంధానంగా ఉండేది ప్రెస్ క్లబ్. శివ మేనమామ ఈశ్వర్ ప్లెస్ క్లబ్ ఛైర్మన్ గా ఉంటాడు.
ట్విస్టులు : కొన్ని వార్తలు రాస్తూ, అధికారంలో వారికి వ్యతిరేకంగా న్యూస్ రాయకుండా అన్యాయం, అవినీతికి సహాయంగా నిలుస్తుంటారు రిపోర్టర్స్. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం నుంచి ఒత్తిడి తట్టుకుంటూ రిపోర్టర్ బాధ్యతలు చేపడుతుంటారు. ఈ సమయంలో ఆ ప్రాంతానికి ఎస్సై ఎడ్విన్ కొత్తగా వస్తాడు. దీంతో రిపోర్టర్స్ అనుకున్న విధంగా సాగదు. ఈ క్రమంలో ఎస్సైకి, రిపోర్టర్స్ కు జరిగిన గొడవ ఏంటీ? ఎస్సై ఎడ్విన్ ఎలాంటి చర్యలు చేపట్టాడు? శివను చంపడానికి ఎవరు? ఎందుకు ప్రయత్నించారు? రిపోర్టర్స్ ను రాజకీయనాయకులు ఎలా వాడుకున్నారు? ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు రిపోర్టర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు?
హైదరాబాద్ లో రిపోర్టర్ గా జాబ్ సంపాదించుకోవాలనుకున్న నీల ఏం చేసింది? వంటి ప్రధాన విషయాలుగా తెరకెక్కిందే న్యూసెన్స్ వెబ్ సిరీస్.

విశ్లేషణ: సొసైటీలో మీడియా ఇంపాక్ట్ చాలా ఉంటుంది. పత్రికరంగం అనేది అన్యాయం, అవినీతి, అక్రమాలు, మంచి చెడు అనేక విషయాలు తెలిపే సాధనం. అలాంటి మీడియాను పొగిడేవాళ్లకంటే భయపడే వాళ్లే ఎక్కువ. అయితే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, రిపోర్టర్స్ జీవితాలు ఎలా ఉంటాయి, వారికి ఉండే ప్రెజర్ ఏంటీ వంటి మదనపల్లిలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు.
రిపోర్టర్లపై భయం : నిజాన్నే మీడియా చెబుతుందా.. మీడియా చెప్పేదే నిజమా అని ప్రజలు ఆలోచనకు వచ్చే సమయానికి ముందు జరిగిన కథగా డైరెక్టర్ సిరీస్ ను ఆరంభించారు. రిపోర్టర్ శివపై అటాక్ సీన్ తో సిరీస్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. తర్వాత ఒక గొడవను రిపోర్టర్స్ ఎలా డీల్ చేస్తారు.. అందులో వచ్చే డబ్బు ఎలా తిరిగితిరిగి మళ్లీ వారి దగ్గరికే ఎలా వస్తుందో చూపించి మీడియా పవర్, దానిపై జనాలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న భయాన్ని చూపించారు.

బయట విషయాలు : ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే సమస్యలను రిపోర్టర్స్ ఎలా క్యాష్ చేసుకుంటున్నారు, అధికార పార్టీలు రిపోర్టర్లను ఎలా వాడుకుంటున్నారు, వారితో పనిచేయించుకుంటున్నారు వంటి అంశాలను స్పష్టంగా చూపించారు. రిపోర్టర్స్ అంటే పైకి గౌరవం, భయం చూపిస్తూనే లోపల ఎలా తిట్టుకుంటారో బయట జరిగే విషయాలను ఆవిష్కరించారు. 'న్యూస్ రాస్తే 200 రాయకుంటే ఇలా 2 వేలు' అనే డైలాగ్ తో బాధ్యత కన్నా డబ్బే ముఖ్యమనే చేదు నిజాన్ని చూపించారు.
హైలెట్స్ : "న్యాయం కోసం పోరాడే వారికి సాయంగా నిలిచేదే కలం" అనే డైలాగ్ తో ప్రజలకు భరోసాగా మీడియా ఉంటుందని చెబుతూనే.. "బలవంతుడికి చేతులెత్తి మొక్కాలే గానీ రాళ్లు విసరకూడదు" అనే మాటతో రాజకీయనాయకులకు వ్యతిరేకంగా ఏం చేయలేమని ప్రజలకు హితవు చెప్పారు. అంతేకాకుండా "చిన్న బతుకులు సార్. అన్నీ చూసుకుంటూ పోవాలి. కొలేటరల్ డ్యామేజ్ కింద ఎవరో ఒకరి తల ఇరకాలిగా" అని ఎమ్మెల్యేతో శివ చెప్పే డైలాగ్ ద్వారా అధికార, ప్రతపక్షాల ద్వారా వాళ్లకు ముప్పు జరగకూడదనే రిపోర్టర్ల భయాన్ని చెప్పకనే చెప్పించారు.

అలాంటి క్లైమాక్స్ : ఆరు ఎపిసోడ్స్ గా ఉన్న న్యూసెన్స్ వెబ్ సిరీస్ రిపోర్టర్ల జీవితాన్ని, ప్రజలు వారి కష్టాలు, బాధలు చెప్పుకున్న ఏం చేయలేని నిస్సహాయతను ఆద్యంతం కళ్లకు కట్టినట్టు చూపించి ఆకట్టుకుంది. ఎస్సైతో రిపోర్టర్స్ గొడవలు, ఎవిడెన్స్ లేకుండా ఎమ్ఎల్యేకు ఫేవర్ గా న్యూస్ రాసే అంశాలు టచ్ చేశారు. ఇక చివరి ఎపిసోడ్ అంతగా ఇంపాక్ట్ చూపించదు. ఎపిసోడ్ ఎండింగ్ కు 5 నిమిషాల మందు వచ్చే పాట, శివ మరదలు సువర్చల ట్రాక్ అనవసరం అనిపించింది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగానే ఉంది. దాన్ని కంటిన్యూ చేస్తూ రెండో సీజన్ కు హింట్ ఇచ్చారు.
బ్రేక్ వేసినట్లు : ఇక క్లైమాక్స్ మంచి ఎండింగ్ లా కాకుండా మధ్యలో బ్రేక్ వేసినట్లుగా అనిపించింది. అయితే నిజ సంఘటనలు, రిపోర్టర్స్ జీవన శైలి వంటివి అంశాలతో సిరీస్ తెరెక్కింది. కాబట్టి సినిమాల తరహాలో హీరోయిజం, క్లైమాక్స్ ఊహించకోకూడదు. 'న్యూస్ రాసేవాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది' వంటి ఇతర డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. బీజీఎమ్ చాలా బాగుంది. సన్నివేశాలకు తగినట్లుగా మూడ్ క్రియేట్ చేసింది. పాటలు పర్వాలేదనిపిస్తాయి.

ఎవరెలా చేశారంటే : రిపోర్టర్ శివగా నవదీప్ చాలా బాగా చేశాడు. ఈ పాత్రకు చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. హావాభావాలు చాలా బాగా పలికించాడు. నీలగా బిందు మాధవి కూడా ఆకట్టుకుంది. కొంచెం గ్లామర్, అభినయంతో అట్రాక్ట్ చేసింది. అయితే ఆమె మాట్లాడే స్లాంగ్ బాగున్నా తెలుగు పదాలు పలకడానికి ఇబ్బందిపడినట్లుగా అనిపించింది. మిగతా నటీనటులు అందరూ చాలా బాగా చేశారు. వారి పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతిక, నిర్మాణ విలువలు అన్ని కుదిరాయి.
ఫైనల్ గా చెప్పాలంటే : ప్రస్తుతం నేటి సమాజంలో రిపోర్టర్స్ నిర్వహిస్తున్న బాధ్యతలు, మీడియా ప్రాధాన్యత, రిపోర్టర్లపై ప్రజల నుంచి రాజకీయ నాయకులకు ఉన్న నమ్మకం తదితర అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించిన సిరీస్ న్యూసెన్స్. సిరీస్ చూస్తున్నంతసేపు సమాజంలో జరిగే సంఘటనలు గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. వీకెండ్ లో టైమ్ చూసుకుని ఓ లుక్కేయండి.



Click it and Unblock the Notifications











