The Kerala Story Movie: రెండు వందల కోట్ల సినిమాకు దిక్కే లేకుండా పోయిందే!
హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది కేరళ స్టోరీ. కేరళలో వివాదాస్పదమైన లవ్ జిహాద్ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు. విడుదలకు ముందే ఎన్నో అడ్డంకులని ఎదుర్కొన్న ఈ సినిమా.. థియేటర్లకు వచ్చాక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 200 కోట్ల వసూళ్లను సాధించింది. ఇన్ని కోట్లు సాధించిన సినిమాకు ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఏ సంస్థ కూడా ముందుకు రావడం లేదట. ఆ వివరాళ్లోకి వెళితే...
విడుదలకు ముందు నుంచి వివాదాలే : ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ చిత్రం మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రాలు పోషించారు. సన్షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్లాల్ షా ఈ చిత్రాన్ని రూపొందించారు. వాస్తవాల్ని వక్రీకరిస్తూ ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఈ సినిమాను తెరకెక్కించారని విమర్శలొచ్చాయి. వివిధ రంగాల మేధావులు కూడా ఈ సినిమా కథాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.


రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు : అయితే ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చాయి. ఈ మూవీకి లాంగ్ రన్లో ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇలా థియేటర్లలో అదరగొట్టి, అందరి నోళ్లలో నానిన ది కేరళ స్టోరీ ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను కొనడానికి ఏ ఓటీటీ సంస్థ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇటీవల జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని వార్తలు వచ్చాయి. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఈ సినిమాను ఏ డిజిటల్ ప్లాట్ ఫాం కొనలేదని తెలుస్తోంది.

ఆసక్తిచూపని ఓటీటీ సంస్థలు : ఈ విషయమై చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్ మాట్లాడుతూ 'ఓటీటీ ప్లాట్ఫామ్స్పై ఈ సినిమా హక్కుల కోసం ఎవరూ ఆసక్తిని చూపించడం లేదు. మాకు ఆమోదయోగ్యమైన ఆఫర్ లభిస్తే అప్పుడు ఆలోచిస్తాం' అని పేర్కొన్నారు. సమాజంలోని భిన్న వర్గాల నుంచి ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఈ సినిమా హక్కుల విషయంలో ఓటీటీ సంస్థలు ఆసక్తిచూపడం లేదని తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











