150 గొర్రెల్లో 11 మిగిలాయి .. వైసీపీపై పరోక్షంగా పృథ్వీ సెటైర్లు!
ఇండస్ట్రీలో ఏళ్ల నుంచి ఉన్నా .. కృష్ణవంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో ఫేమస్ అయ్యారు పృథ్వీరాజ్. ఆ తర్వాత 30 ఇయర్స్ పృథ్వీగా పిల్లలు, పెద్దలతో ముద్దుగా పిలిపించుకున్నారు . తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీలతో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ అయ్యారు పృథ్వీ. ముఖ్యంగా గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన లౌక్యం సినిమాలో తన కామెడీ పంచ్లతో ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు.
సినిమాలలో బిజీగా ఉంటూనే రాజకీయాలపై ఆసక్తితో వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీలో చేరారు. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయనతో కలిసి నడిచారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేసి జగన్ కంట్లో పడ్డారు. ఈ క్రమంలోనే పృథ్వీ సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్కు ఏకంగా ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు సీఎం. పృథ్వీరాజ్.. ఎస్వీబీసీలోని మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించారని, వేతనాలు పెంచుతానంటూ వారిని లోబరచుకున్నారని కొందరు ఆరోపణలు సైతం చేశారు.

అలాగే ఛైర్మన్ హోదాలో కొందరు ఉద్యోగులను ఇష్టానుసారం నియమించారని, డబ్బులు వసూలు చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఎం జగన్, అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు పృథ్వీ తన పదవికి రాజీనామా చేశారు. అయితే తనను కావాలని కొందరు ఈ వివాదంలో ఇరికించారంటూ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తదనంతర కాలంలో వైసీపీకి సైతం రాజీనామా చేసిన పృథ్వీ.. బయటికి వచ్చిన తర్వాత ఆ పార్టీని, నేతలను తీవ్రంగా విమర్శించేవారు. ఆపై జనసేన పార్టీలో చేరి కూటమి అభ్యర్ధుల తరపున పృథ్వీ విస్తృతంగా ప్రచారం చేశారు.
వీలు కుదిరినప్పుడల్లా వైసీపీని టార్గెట్ చేస్తున్న పృథ్వీ.. తాజాగా ఆ పార్టీపై సెటైర్లు వేశారు. మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన లైలా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్లో ఫిబ్రవరి 9న ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా 30 ఇయర్స్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. విశ్వక్సేన్ పెద్ద స్టార్ అవుతాడని అప్పుడే వాళ్ల నాన్నతో చెప్పానని గుర్తుచేశారు. అక్కడితో ఆగితే ఏ గొడవ ఉండేది కాదు.. కానీ అక్కడే ఆయన టంగ్ స్లిప్ అయ్యాడు.
ఈ సినిమాలో 150 మేకలు ఉండాలని.. కానీ లాస్ట్ సీన్లో నా బామ్మర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారని , కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయని ఇది యాధృచ్చికంగా జరిగిందో.. లేక సినిమాలో అలా సెట్ అయ్యిందో కానీ కొన్ని గుర్తొచ్చాయని పృథ్వీ చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వైసీపీని కావాలనే ఆయన టార్గెట్ చేశారని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాగా.. 2024 ఎన్నికల్లో అదే వైసీపీ 11 సీట్లకు పడిపోవడం రాజకీయ వర్గాలను షాక్కు గురిచేసింది.


Click it and Unblock the Notifications











