బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా.. జడ్జి ఎదుట గుండెలు బాదుకొన్న పోసాని!
సినీనటుడు, దర్శక , నిర్మాత పోసాని కృష్ణమురళి అరెస్ట్ వ్యవహారం తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 15 రోజులుగా జైల్లోనే ఉన్న ఆయనకు పలు కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో త్వరలోనే పోసాని కృష్ణమురళి విడుదల అవుతారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా సీఐడీ అధికారులు పీటీ వారెంట్ జారీ చేయడంతో పోసాని బెయిల్కు బ్రేక్ పడింది. తాజాగా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పోసాని న్యాయస్థానంలో ఎమోషనల్ అయ్యారు.
కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారంటూ పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లాకు చెందిన జనసేన నేత ఒకరు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత నెల 26న హైదరాబాద్కు చేరుకుని , నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న పోసాని నివాసంలో ఆయనను అదుపులోకీ తీసుకున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అక్రమమంటూ ఆయను రాత్రంతా ఎక్కడెక్కడో తిప్పారంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు.

ఎట్టకేలకు రైల్వే కోడూరు జైల్లో ఆయనను హాజరుపరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ సమయంలోనే పోసానికి బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయమూర్తిని కోరారు. ఈ వాదనను తిరస్కరించిన కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో కృష్ణమురళీని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోసాని కృష్ణమురళీపై కేసులు నమోదు కావడంతో పోలీసులు పలు ఏరియాలకు తరలించాల్సి వచ్చింది.
నరసరావుపేట, విజయవాడలోని భవానీపురం పోలీసులు, ఆదోనీ పోలీసులు ఆయనపై పీటీ వారెంట్ జారీ చేశారు. అయితే అన్ని కేసుల్లోనూ పోసాని కృష్ణమురళికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కానీ ఈలోపు ఏపీ సీఐడీ పోసానికి షాకిచ్చింది. గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో ఆయన బెయిల్, విడుదల నిలిచిపోయాయి. పీటీ వారెంట్తో కర్నూలు జిల్లా జైలుకు వెళ్లిన సీఐడీ అధికారులు పీటీ వారెంట్పై పోసానిని కోర్టు ముందు హాజరుపరిచారు.

సీఐడీ అధికారులు జారీ చేసిన పీటీ వారెంట్ను గుంటూరు కోర్టు అనుమతించడంతో పోసానిని గుంటూరు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సుదీర్ఘంగా వాదనలు జరగ్గా.. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సమయంలో పోసాని కృష్ణమురళి భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. తన మీద ఎన్ని కేసులున్నాయో తనకే తెలియదని, రాష్ట్రమంతా తిప్పుతున్నారని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.
తన ఆరోగ్యం ఏమాత్రం బాలేదని.. 2 ఆపరేషన్లు చేశారని, స్టంట్లు వేశారని .. నాకు భార్యాబిడ్డలు ఉన్నారని పోసాని కృష్ణమురళీ పేర్కొన్నారు. తనకు రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని న్యాయమూర్తి ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నారు పోసాని. ఈ నేపథ్యంలో పోలీసులు ఏం చేయనున్నారు? పోసానికి బెయిల్ వస్తుందా? రాదా అన్న సస్పెన్స్ నెలకొంది.


Click it and Unblock the Notifications











